టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. గతంలో టీడీపీ 23, జనసేన 1 సీటు గెలుచుకున్నాయని.. ఈసారి ఒక్కటి కూడా గెలవరని కారుమూరి జోస్యం చెప్పారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాజమండ్రిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. గెలిచే సత్తా లేక చంద్రబాబు, పవన్ తప్పుడు కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ 23, జనసేన 1 సీటు గెలుచుకున్నాయని.. ఈసారి ఒక్కటి కూడా గెలవరని కారుమూరి జోస్యం చెప్పారు.

పవన్ , చంద్రబాబులకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వాలంటీర్లను పవన్ దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చడంపైనా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆయన అవివేకానికి నిదర్శమనమన్నారు. యాదవ సామాజిక వర్గానికి అత్యధిక స్థానాలు కేటాయించింది వైసీపీయేనని.. రాష్ట్రంలో వారిని గౌరవించింది జగనేనని మంత్రి ప్రశంసించారు. 

అంతకుముందు మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ , చంద్రబాబు ఇద్దరిలో అసహనం కనిపిస్తోందన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో గత ప్రభుత్వం దోచేసిందని అంబటి ఆరోపించారు. పట్టిసీమ పేరుతో దోపిడీ చేశారని రాంబాబు పేర్కొన్నారు. దోపిడీ కోసమే చంద్రబాబు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారని మంత్రి ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని రాంబాబు ఫైర్ అయ్యారు. 

ALso Read: జనసైనికులను ముంచేస్తాడు.. పవన్ మోసం చేశాడని రేణూ దేశాయే చెప్పింది : అంబటి రాంబాబు

రూ.834 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని.. చంద్రబాబు కేవలం దోపిడీ కోసమే కొన్ని ప్రాజెక్ట్‌లు ప్రారంభించారని మంత్రి ఆరోపించారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు లేదని.. ప్రాజెక్ట్‌ల సందర్శన పేరుతో హడావుడి చేస్తున్నారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రాజెక్ట్‌లను సందర్శించాక వర్షాలు ఆగిపోయాయని మంత్రి సెటైర్లు వేశారు. ఎల్లో మీడియా పిచ్చిపిచ్చి రాతలు రాస్తోందని.. ఈనాడు కక్షపూరితంగా కథనాలు ప్రచురిస్తోందని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రజలు నమ్మొద్దని.. రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను దోపిడీ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్, పవన్, ఎల్లో మీడియానే దండుపాళ్యం బ్యాచ్ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకుందామని ఎదురుచూస్తున్నారని.. వాలంటీర్లపై పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని రాంబాబు దుయ్యబట్టారు.

రుషికొండను సందర్శించే పేరుతో హడావుడి చేశారని.. కొండలను తొలగించి ఇళ్లు కట్టుకోవడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌లో అడుగడుగునా అసహనం కనిపిస్తోందని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని రాంబాబు స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే చర్యలు తప్పవని.. పవన్ ద్రోహం చేశారని రేణు దేశాయ్ స్వయంగా చెప్పారని అంబటి చురకలంటించారు. భర్త ఎలాంటి వాడైనా భార్య సపోర్ట్ చేయడం సాధారణమన్నారు.