Asianet News TeluguAsianet News Telugu

కాలేజీని ఓపెన్ చేశారంతే.. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీపై బాబువన్నీ అబద్ధాలే : మంత్రి కాకాణి

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీ గురించి చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆ కాలేజీని చంద్రబాబు కేవలం ఓపెన్ మాత్రమే చేశారని మంత్రి చురకలు వేశారు. 

minister kakani govardhan reddy slams tdp chief chandrababu naidu over ac subba reddy medical college issue
Author
First Published Sep 24, 2022, 2:35 PM IST

టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే వస్తాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్సార్ ఎంతో కృషి చేశారని గోవర్థన్ రెడ్డి ప్రశంసించారు. అందువల్ల హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడమే సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కాకాణి మండిపడ్డారు. 

తాను అధికారంలో వున్నప్పుడే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీని తామే కట్టామని చెబుతున్నారని, కానీ అది పచ్చి అబద్ధమని మంత్రి చురకలు వేశారు. 2013 ఏప్రిల్ 3న ఆ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారని, 2013 ఆగస్ట్ 24న ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీగా నామకరణం చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆ కాలేజీకి చంద్రబాబు ప్రారంభోత్సవం చేయడం తప్పించి చేసిందేమీ లేదని ఆయన చురకలు వేశారు. 

ఇకపోతే.. నిన్న కుప్పం పర్యటన సందర్భంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఏపీ సీఎం వైఎస్ జగన్. హైద్రాబాద్ కు చంద్రబాబు లోకల్, కుప్పానికి నాన్ లోకల్ అని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. వెన్నుపోటు, దొంగఓటుకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని  .. దొంగ ఓట్ల విషయంలో చంద్రబాబు గురించి జిల్లాలో కథలు కథలుగా చెప్పుకొంటారని సీఎం జగన్ విమర్శించారు. ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమలాంటిదే కుప్పంపై చంద్రబాబుకు ఉందని జగన్ సెటైర్లు వేశారు. 

ALso REad:కుప్పానికి ఏం చేశాడు, ఇంత చేతకాని నేతను చూడలేదు: చంద్రబాబుపై జగన్ ఫైర్

కుప్పం నుండి చంద్రబాబు నాయుడు చాలా తీసుకున్నారని... కానీ కుప్పానికి మాత్రం ఏమీ చేయలేదన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా కూడా  కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేయలేదని జగన్ దుయ్యబట్టారు. ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకొనే చంద్రబాబునాయుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం రోడ్లు కూడా వేయించలేదని సీఎం విమర్శించారు. మంచినీటి సమస్యను పరిష్కరించలేదని.. హంద్రీనీవాకు చంద్రబాబే అడ్డు అని జగన్ ఆరోపించారు. తన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని... కుప్పంలో కనీసం డబుల్ రోడ్లు వేయలేని చంద్రబాబునాయుడు ఎన్నికలు వచ్చేనాటికి విమానాశ్రయం తీసుకు వస్తానని మాత్రం హమీ ఇస్తారని జగన్ ఎద్దేవా చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios