తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు మంత్రి జోగీ రమేశ్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో టీడీపీ తప్పుకున్నా.. వేరే పార్టీకి మద్ధతుగా నిలుస్తుందని ఆయన ఆరోపించారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేత (ysrcp) , మంత్రి జోగి రమేశ్ (jogi ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan) నేతృత్వంలో వైసీపీ బలమైన శక్తిగా ఎదిగిందన్న ఆయన ... విపక్ష టీడీపీ మాత్రం ఆరిపోయే దీపంలా మారిందన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని జోగీ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆత్మకూరులో శనివారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన టీడీపీ ఇతర పార్టీలకు లోపాయికారి మద్దతు ఇచ్చేందుకు ఏమాత్రం వెనుకాడదని జోగి రమేశ్ ఆరోపించారు. ఫలితంగా ఉప ఎన్నికలో వైసీపీ మెజారిటీ తగ్గే అవకాశం ఉందని, టీడీపీ కుయుక్తులకు చెక్ పెట్టేలా పార్టీ శ్రేణులు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక మాదిరిగానే ఆత్మకూరు ఉప ఎన్నిక ఉంటుందన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా పార్టీ నేతలు కృషి చేయాలని జోగీ రమేశ్ పిలుపునిచ్చారు.
Also Read:Atmakur Bypoll : ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ, బరిలో 14మంది అభ్యర్థులు...
ఇకపోతే.. Atmakur bypollకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ ప్రక్రియ గురువారం ముగిసిందని Returning Officer జిల్లా జాయింట్ కలెక్టర్ హరిందర్ ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరులో ఇన్చార్జ్ ఆర్టీవో బాపిరెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం ఇరవై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ సాంకేతిక కారణాలతో 13 నామినేషన్లను తిరస్కరించినట్లు చెప్పారు.
స్వతంత్ర అభ్యర్థి ఒకరు గురువారం నామినేషన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. మిగిలిన 14 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారు అని చెప్పారు. బిజెపి, bsp, వైఎస్ఆర్సిపి, అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు ఉన్నాయని.. ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన వివిధ పార్టీలకు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు అభ్యర్థులందరూ సహకరించాలని కోరారు.
కాగా, ఈ ఉపఎన్నికకు దూరంగా ఉండలని టీడీపీ జూన్ 2న ప్రకటించింది. పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. గుండెపోటుతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న మేకపాటి గౌతం రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. మేకపాటి గౌతంరెడ్డి కుటుంబసభ్యులు కూడా విక్రంరెడ్డిని ఈ స్థానం నుండి పోటీకి నిలపాలనే విషయం మీద ఏకాభిప్రాయానికి వచ్చారు. మేకపాటి గౌతం రెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేశారు. దివంగత మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు విక్రంరెడ్డిని బరిలోకి దింపినందున ఈ స్థానంలో పోటీ చేయడం లేదని చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. ఆత్మకూరు ఉప ఎన్నిక విషయమై YCP నేతల సవాళ్ల విషయమై చంద్రబాబు మండిపడ్డారు. బద్వేల్ బైపోల్ లో ఎందుకు దూరంగా ఉన్నామో ఆత్మకూరు ఉప ఎన్నికకు కూడా దూరంగా ఉంటున్నామని చంద్రబాబు చెప్పారు.
