మద్యపాన నిషేధంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధం అన్న మాటే తమ మేనిఫెస్టోలో లేదన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మద్యం తాగాలంటే వారికి షాక్ కొట్టేలా చేస్తామనే తాము అన్నామని గుడివాడ తెలిపారు.
ఏపీలో మద్యపాన నిషేధానికి సంబంధించి వైసీపీ నేత (ysrcp), మంత్రి గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధం అన్న మాటే తమ మేనిఫెస్టోలో లేదన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో మద్యం ధరలను క్రమంగా పెంచుతున్న వైనంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలను ఫైవ్ స్టార్ హోటల్ రేట్లకు తీసుకెళ్తామని మాత్రమే చెప్పామని గుడివాడ పేర్కొన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మద్యం తాగాలంటే వారికి షాక్ కొట్టేలా చేస్తామనే తాము అన్నామని.. అందులో భాగంగానే మద్యం ధరలపై తాము ఇప్పుడు చేస్తున్నామన్నారు.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ లభిస్తున్న పలు మద్యం బ్రాండ్లలో విషపూరిత రసాయనాల, మోతాదుకు మించి రసాయనాలు వాడుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి మద్యం తాగడం వల్ల మతిభ్రమించడం, నరాలు లాగేయడం, మెదడుతో పాటు నరాల్లో సూదులు గుచ్చినట్లు ఇలా వింత రోగాల భారినపడే అవకాశాలున్నాయని టిడిపి నాయకులు ఇటీవల ఆరోపించారు. ఈ ప్రచారంపై లిక్కర్ తయారీదారుల అసోసియేషన్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు.
Also Read:మందుబాబులకు బ్యాడ్ న్యూస్... మద్యం ధరలు పెంచాలని జగన్ సర్కార్ కు వినతి
పక్కనే వున్న తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం తక్కువ ధరకే మద్యం ఇస్తుందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఇప్పుడు ఇస్తున్న ధరలు తమకు గిట్టుబాటు కావడం లేదని... మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. 2017 నుండి తమకు మద్యం అమ్మకాలపై సరయిన లాభాలు లేవని... ధరలు తక్కువగా వుండటమే అందుకు కారణమన్నారు.
ఇక ఏపీలో మద్యం సరఫరా చేసే డిస్టిలరీలను ఎంతో క్వాలిటీగా మెయింటెన్ చేస్తున్నామని... ఇందులో తయారయ్యే మద్యం క్వాలిటీగానే వుంటుందన్నారు. డిస్టిలరీపై ఎలాంటి అనుమానాలున్నా తమకు సంప్రదించవచ్చని ప్రజలకు సూచించారు. కానీ బయట జరిగే ఎలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అసోసియేషన్ ప్రతినిధులు సూచించారు.
ఒక్కో మద్యం కంపనీ నుండి నాలుగైదు బ్రాండ్ లు మార్కెట్లోకి వస్తుంటాయని... ఇలా ఏపీలో 184 బ్రాండ్ల అమ్మకానికి అనుమతి వుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. వీటిపైనే రాష్ట్రంలోని నాలుగు లక్షల మంది ఆదారాపడి జీవిస్తున్నారని అన్నారు. అలాంటిది మద్యంపై దుష్ప్రచారం తగదని... ఏవయినా అనుమానాలు వుంటే డిస్టిలరీలను పరిశీలించవచ్చని లిక్కర్ తయారీదారుల అసోసియేషన్ స్పష్టం చేసింది.
కొన్ని బ్రాండ్లలో విషపూరితమైన పదార్ధాలు వాడుతున్నట్లు ప్రచారం జరుగుతోందని... ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. హాని కలిగించే రసాయనాలను ఏ బ్రాండ్ లోనూ వాడటం లేదన్నారు. టిడిపి వాళ్లు ఆరోపణలు చేసిన విధంగా ఏ మద్యం బ్రాండ్ లోనూ విషపదార్థాలు లేవని స్పష్టం చేసారు.
