ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం ఏపీకి కొత్త రాజధాని కాబోతుందని అన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ టెక్ సమ్మిట్‌లో మంత్రులు అమర్‌నాథ్, బొత్స సత్యనారాయణ, విడదల రజిని, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ కూడా రానున్న నెల్లలో విశాఖకు షిఫ్ట్ కానున్నారని తెలిపారు. విశాఖలో ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. 

విశాఖ ఇప్పటికే అభివృద్ది చెందిన నగరం అని అన్నారు. ప్రపంచంలోనే అభివృద్ది చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని చెప్పారు. త్వరలో భోగాపురం వద్ద ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. వచ్చే నెలలో విశాఖపట్నంలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుందని గుర్తుచేశారు. 

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంతో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ రాజధాని అంశంపై మంగళవారం రోజున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని బుగ్గన స్పష్టం చేశారు. మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్ అని.. పరిపాలన అంతా విశాఖ నుంచే జరుగుతుందని తెలిపారు. కర్నూలు మరో రాజధాని కాదని.. అక్కడ హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుందని చెప్పారు. దీంతో మూడు రాజధానులపై వైసీపీ స్టాండ్ ఏమిటనేదానిపై తీవ్ర చర్చ మొదలైంది. 

ఈ క్రమంలోనే స్పందించిన వైఎస్సార్‌సీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. మూడు రాజధానుల ప్రతిపాదనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రాజధాని విషయంలో ప్రభుత్వ నిర్ణయమే అంతిమమని, రాజధాని విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. వికేంద్రీకరణే తమ విధానమని చెప్పారు. అయితే తాజాగా గుడివాడ అమర్‌నాథ్.. విశాఖ ఏపీకి కొత్త క్యాపిటల్ సిటీ అని కామెంట్ చేశారు.