ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి తెలియజేయనున్నట్టుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీయల్ పాలసీని అమల్లోకి తీసుకోస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి తెలియజేయనున్నట్టుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 3,4 తేదీల్లో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్‌నాథ్.. దేశంలోనే అతిపెద్ద సముద్రతీరం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్దికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 

రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీయల్ పాలసీని అమల్లోకి తీసుకోస్తామని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. 14 రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు జరుగుతాయని చెప్పారు. ఐటీ, ఎలక్ట్రానిక్ సెక్టార్‌లో మూడు కాన్సెస్ట్ సిటీలు.. విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలపై ఫోకస్ చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. విశాఖపట్నంలో ఇప్పటికే కొంత ఎకోసిస్టమ్ డెవలప్ అయిందని.. రాష్ట్రంలో మేజర్ ఐటీ డెస్టినేషన్‌గా ఉందని చెప్పారు. విశాఖతో పాటు చెన్నైకి దగ్గరగా ఉన్న తిరుపతిలో, బెంగళూరుకు దగ్గరగా ఉన్న అనంతపురంలలో కూడా ఐటీ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలిపారు. మిగిలిన పట్టణాల్లో కూడా ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. 

నూతనంగా నిర్మాణం చేపట్టబోతున్న భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టుకు అనుకుని 100 ఎకరాల్లో కొత్త ఐటీ పార్క్‌ను అభివృద్ది చేయాలని ఎస్‌ఐపీపీలో క్లియరెన్స్ చేయడం, కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 3 లక్షల ఎస్‌ఎఫ్‌టీతో స్టార్టప్ టవర్‌ను కూడా నిర్మించమని సీఎం జగన్ ఇటీవల ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను త్వరలో చేపట్టనున్నట్టుగా చెప్పారు. 

ఎలక్ట్రానిక్ సెక్టార్‌లో నాలుగు ఈఎంసీలు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. టీసీఎల్‌ వంటి కంపెనీలను ఇప్పటికే ఆపరేషన్‌లోకి తీసుకోని వచ్చామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి సెకన్‌కు ఒక మొబైల్ ఫోన్ తయారవుతుందని చెప్పడానికి గర్వపడుతున్నట్టుగా చెప్పారు.