కర్నూలుకు హైకోర్టు సాధించి తీరుతాం.. జగన్నాథ గట్టుపై కట్టబోతున్నాం: మంత్రి బుగ్గన
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం చంద్రబాబు నాయుడుకు ఇష్టమో లేదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం చంద్రబాబు నాయుడుకు ఇష్టమో లేదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు అమరావతిలోని రియల్టర్లపైనే ప్రేమ అని విమర్శించారు. మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులోని ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో నేడు రాయలసీమ సభ గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు అధికార వైసీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సభలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన, అంజాద్ బాషా,గుమ్మనూర్ జయరాం, ఉషాశ్రీ చరణ్, వైసీపీ నాయకులు, రాయలసీమ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. శతాబ్దాలుగా కరువు ఎదుర్కొంటున్న రాయలసీమ గురించి చంద్రబాబు ఆలోచించాలన్నారు. 300 ఏళ్ల క్రితం రాయలపాలన కాలంలో.. అప్పటి భారత ఖండంలోనే అత్యంత సంపద కలిగిన ప్రాంతం రాయలసీమ అని అన్నారు. చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ అని.. తమ దృష్టిలో రత్నాల సీమ అని అన్నారు. రాయలసీమకు హైకోర్టు సాధించేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. హైకోర్టు సాధించి.. జగన్నాథ గట్టుపై హైకోర్టు కట్టబోతున్నామని చెప్పారు. ఇందుకు ప్రజలందరి మద్దతు ఉండాలని కోరారు.
వికేంద్రీకరణ కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అసలు చిత్తశుద్ది లేదని విమర్శించారు. అమరావతిలో తన వాళ్ల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు.
ఇక, మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ సభ గర్జన సభ నిర్వహించారు. మేధావులు, న్యాయవాదులు, విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు అధికార వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి ప్రజలు, వైసీసీ శ్రేణులు హాజరయ్యారు.