తెలుగుదేశం పార్టీపైనా, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పైనా విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికార పార్టీపై నానా యాగీ చేస్తున్న విపక్ష నేతలు.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు

తెలుగుదేశం పార్టీపైనా, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పైనా విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికార పార్టీపై నానా యాగీ చేస్తున్న విపక్ష నేతలు.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని తెలిసిన టీడీపీ నేతలు రోజుకో పంచాయతీని తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. 

ప్రతిపక్షానికి లబ్ధి చేకూరే ఎలాంటి పొరపాట్లకు ఆస్కారమివ్వమని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎంపీటీసీలు ఏకగ్రీవమైన ప్రాంతాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాయడాన్ని మంత్రి తప్పుపట్టారు.

సర్పంచ్‌ అభ్యర్థి భర్త చనిపోతే ఎన్నికల కమిషనర్ సంఘటన స్థలానికి వెళ్లడం అనేది తాను మొదటిసారిగా చూస్తున్నానని బొత్స మండిపడ్డారు. టీడీపీ నేతల తీరు చూస్తుంటే సునీల్ గవాస్కర్ ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు పరిస్థితి గుర్తుకొస్తుందని సత్యనారాయణ సెటైర్లు వేశారు. 

నందికొట్కూర్ వైఎస్సార్‌సీపీ విభేదాలపై స్పందించిన మంత్రి .. పంచాయతీ ఎన్నికల్లో టికెట్ల కోసం వైఎస్సార్‌సీపీ నేతల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు సహజమేనని వ్యాఖ్యానించారు.