హైదరాబాద్, ఢిల్లీలే మునిగిపోయాయి , కొన్నిసార్లు తప్పదు : వర్షాలు, వరదలపై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రత్యేక పరిస్థితుల్లో కురిసే వర్షాలకు ఇలా జరగడం సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలకు హైదరాబాద్ వంటి సిటీయే మునిగిపోయిందన్నారు. చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీ, దేశ రాజధాని ఢిల్లీయే మునిగిపోయిందని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేక సందర్భాలలో వచ్చే వర్షాలకు మునగడం సహజమని బొత్స వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మునిగిపోక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందని.. ఒకసారి ఆయన విజయనగరం వచ్చి అభివృద్ధి ఎలా వుంటుందో చూడాలన్నారు. కుప్పం కంటే మా జిల్లా ఎంతో బాగుంటుందని బొత్స చురకలంటించారు.
Also Read:పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో తేలాలి: రోజా సంచలనం
అటు అమ్మఒడి సభకు విద్యార్ధులను తీసుకెళ్లడంపై హైకోర్టు నోటీసులపైనా బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్ధులు కాకుండా సినిమా యాక్టర్లు వస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల రాకకు సంబంధించి కోర్ట్ సూచనలు ఇస్తే పాటిస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రజలకు జగన్ మంచి చేస్తుంటే టీడీపీ ఓర్వలేకపోతోందని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.