విశాఖకు రాజధాని వచ్చేసింది.. మనుషులే రావాలి : మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
విశాఖకు రాజధాని ఇప్పటికే వచ్చేసిందని.. మనుషులు రావడమే మిగిలిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధానిలో ఒకే సామాజిక వర్గం ఉండాలని రాసి వుందా అని ఆయన నిలదీశారు.
విశాఖ పరిపాలనా రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లడుతూ.. విశాఖకు రాజధాని ఇప్పటికే వచ్చేసిందన్నారు. మనుషులు రావడమే ఇక విశాఖకు మిగిలి వుందన్నారు. రాజధాని వెంటే మెట్రో రైలు వస్తుందని.. అమరావతి ఏమైనా బ్రహ్మ పదార్ధమా అని బొత్స ప్రశ్నించారు. రాజధానిలో ఒకే సామాజిక వర్గం ఉండాలని రాసి వుందా అని ఆయన నిలదీశారు. అవినాష్ రెడ్డి కేసులో రోజుకో డ్రామా ఆడుతోంది సీబీఐనే అని బొత్స వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో మహా డ్రామా జరుగుతోందని.. ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. మళ్లీ ఆయన ఫోటోకు చంద్రబాబే దండ వేస్తున్నారని బొత్స దుయ్యబట్టారు.
అంతకుముందు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. తాను నిండు నూరేళ్లు జీవించి వుండేవాడిని అని ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. మళ్లీ ప్రాణం పోస్తే చంద్రబాబును సమాధి చేస్తానని ఎన్టీఆర్ దేవుడిని కోరుకుని వుంటారని జోగి రమేష్ పేర్కొన్నారు. తామే చెప్పులు వేసి, చిత్రవధ చేసి చంపిన వ్యక్తికి శతజయంతి పేరుతో వాళ్లే దండలు వేసి దండాలు పెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారంటూ జోగి రమేష్ ఆరోపించారు. తన పాలనలో పేదలకు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదని.. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.