ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పరిపాలనా సౌకర్యం కోసం కేబినెట్ ఏర్పాటు ఉంటుందని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పరిపాలనా సౌకర్యం కోసం కేబినెట్ ఏర్పాటు ఉంటుందని అన్నారు. కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనేది ముఖ్యమంత్రి ఇష్టమని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం మార్పులు- చేర్పులు ఉంటాయని తెలిపారు. దానిపై ఊహాగానాలు సరైనవి కాదని.. తనలాంటి మంత్రులు మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. ఇటీవలి ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాకు మంత్రివర్గంలో మార్పునకు సంబంధం లేదని అన్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తన వైఫల్యమే కారణమని చెప్పారు. లోపం ఎక్కడుందో సమీక్షించుకుంటామని తెలిపారు. ఓటమిని  వేరేవారిపైకి నెట్టడం తనకు అలవాటు లేదని చెప్పారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మార్పుల దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికలకు బలమైన కేబినెట్‌తో ఆయన రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న మంత్రివర్గం.. తన తొలి కేబినెట్ కంటే వీక్‌గా వుందని ఆయన అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. విపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా బదులిచ్చే వారు కరువయ్యారని సీఎం పలుమార్లు అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అందుకే కొత్తగా ఎమ్మెల్సీలుగా గెలిచిన వారిలో సామాజిక సమీకరణలు పక్కనపెట్టి.. సమర్ధులైన వారిని కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. 

ఇదిలావుండగా.. స్పీకర్ తమ్మినేని సీతారాంకు మంత్రివర్గంలో బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం సీఎం జగన్‌ను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. గత కొంతకాలంగా తనను కేబినెట్‌లోకీ తీసుకోవాల్సిందిగా జగన్‌ను తమ్మినేని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రిని స్పీకర్ కలవడంతో వైసీపీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. తమ్మినేని సీతారాంను కేబినెట్‌లోకి తీసుకుంటారా అంటూ సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంపైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

తమ్మినేనిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మరి స్పీకర్‌గా ఎవరిని నియమిస్తారన్న దానికి సమాధానంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు వినిపిస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల మధ్య మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత కలిగించింది. కేబినెట్‌లో మార్పు చేర్పులపై క్లారిటీ ఇవ్వడానికే సీఎంవో నుంచి అప్పలరాజుకు పిలుపొచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తాను మంత్రిగా వున్నా.. లేకున్నా, మంత్రినే.. నేనే కాదు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులేనంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ కాసేపటికీ స్పీకర్ తమ్మినేని కూడా వెళ్లడంతో వైసీపీలో ఏదో జరుగుతోందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.