ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. సామాన్య ప్రజలనే కాదు కరోనా నిబంధనలు పాటిస్తున్నామని చెబుతున్న రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. 

హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ (corona third wave) ఆంధ్ర ప్రదేశ్ ను వణికిస్తోంది. ఒకవైపు ఒమిక్రాన్ (omicron)... మరోవైపు కరోనా వైరస్ (corona virus) కేసులు అంతకంతకు పెరుగుతూ రాష్ట్రంలో భయాందోళనను సృష్టిస్తోంది. కేవలం సామాన్యులనే కాదు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులనూ ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. ఒకసారి కాదు రెండు మూడు సార్లు కరోనా బారిన పడుతున్నవారు కూడా వున్నారు. ఇలా తాజాగా మంత్రులు సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) నివాసంలోనూ కరోనా కలవరం రేగింది. మంత్రి భార్య శచీదేవి (sachi devi) కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో టెస్ట్ చేయించేకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అయితే మిగతా కుటుంబసభ్యులెవ్వరికీ ఈ వైరస్ వ్యాపించపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ముందుజాగ్రత్తలో భాగంగా కరోనా నిర్దారణ అయిన భార్యతో పాటు మంత్రి బాలినేని, ఇతర కుటుంబసభ్యులు హోంఐసోలేషన్ లోకి వెళ్లారు.

తన భార్యకు కరోనా సోకినా ఆరోగ్యంగానే వుందని మంత్రి తెలిపారు. తనకు కరోనా నిర్దారణ కాకపోయినా ముందుజాగ్రత్త కోసం హోంఐసోలేషన్ లోకి వెళుతున్నట్లు... కొన్నిరోజులు ప్రత్యక్షంగా ఎవరికీ అందుబాటులో వుండనని ప్రకటించారు. తనను కేవలం ఫోన్ ద్వారానే సంప్రదించాలని... కలవడానికి నివాసానికి, కార్యాలయానికి ఎవరూ రావద్దని మంత్రి బాలినేని సూచించారు. 

ఇక ప్రకాశం జిల్లాకు చెందిన మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడ్డారు. గిద్దలూరు (giddaluru) ఎమ్మెల్యే అన్నా రాంబాబు (anna rambabu), కనిగిరి (kanigiri) మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి (ugranarasimha reddy) కూడా కరోనా బారినపడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలు బయటపడటంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఇటీవల తమను కలిసినవారు జాగ్రత్తగా వుండాలని... కరోనా లక్షణాలుంటే టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. 

ఇదిలావుంటే ఇప్పటికే మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. ఆయన కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో హైదరాబాద్ లో ఓ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన పరిప్థితి మెరుగ్గానే వుంది. 

మరో మంత్రి అవంతి శ్రీనివాసరావు కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. స్వల్ఫ లక్షణాలుండటంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా తేలినట్లు తెలిపారు. తనను కలిసిన వ్యక్తులు టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.మరో మంత్రి కొడాలి నాని కూడా కరోనాబారిన పడగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (Ambati Rambabu) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను క్వారంటైన్‌లో ఉంటున్నట్టు... కొన్నిరోజులు ఎవరికీ అందుబాటులో వుండబోనని తెలిపారు.

ఇక తెలంగాణలోని చాలామంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో పాటు ఎంపీలు కేశవరావు, రంజిత్ రెడ్డి కరోనాతో బాధపడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కూడా కరోనాబారిన పడి హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతున్నారు.