ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెల్ ఫోన్ అడిగిన టీచర్ :మంత్రి అయ్యన్న
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ వ్యవస్థపై మంత్రి అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల్లో టికెట్ల కేటాయింపు, ప్రస్తుత ఎన్నికల తీరు సక్రమంగా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ వ్యవస్థపై మంత్రి అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల్లో టికెట్ల కేటాయింపు, ప్రస్తుత ఎన్నికల తీరు సక్రమంగా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రాజకీయాల్లో వ్యక్తుల గొప్పతనాన్ని చూసి టికెట్లు ఇచ్చేవారని, ఇప్పుడు పార్టీ టికెట్ అడిగితే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారని అడిగే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు.
కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన వాడు నిజాయితీగా ఎలా ఉంటాడని మంత్రి అయ్యన్న ప్రశ్నించారు. అవినీతికి పాల్పడకపోతే ప్రజా సేవ చేస్తారా అని విమర్శించారు. ప్రజా సేవ చేద్దాం అనుకునే వారి వద్ద డబ్బులు ఉండవన్నారు. మరోవైపు ఓటర్లు కూడా ఎన్నికల్లో తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న వాళ్లు.. అవినీతి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆఖరికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఒక అధ్యాపకుడు, అతని భార్య తమకు సెల్ఫోన్లు కావాలని అడిగారని తాను ఎదుర్కొన్న అనుభవాన్ని తెలియజేశారు.