వైసీపీలోకి మంత్రి అయ్యన్న సోదరుడు..?
గత కొద్ది రోజులుగా అయ్యన్న పాత్రుడి సోదరుడు సన్యాసి పాత్రుడు ను వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి తన సోదరుడితో ఉన్న కుటుంబ వైరం రాజకీయ వైరంగా మారనుందా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. గత కొద్ది రోజులుగా అయ్యన్న పాత్రుడి సోదరుడు సన్యాసి పాత్రుడు ను వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నర్సీపట్నం వైసీపీ నాయకులు.. ఈమధ్య తరచుగా సన్యాసి పాత్రుడిని కలిసి తమ పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నారు.
సన్యాసి పాత్రుడిని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ అధిష్టానం కూడా ఆసక్తి చూపిస్తోందట. ఇందుకు ముఖ్యకారణంగా ఆయన మంత్రి అయ్యన్న కు సోదరుడు కావడం ఒక కారణం అయితే... నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆయనకు ఉన్న పట్టు మరో కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సన్యాసి పాత్రుడు కనుక వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. ఆ నియోజకవర్గం కచ్చితంగా తమకే దక్కుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
నర్సీపట్నంలో వైసీపీ జెండా పాతాలంటే.. ఓటు బ్యాంక్ ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ చేపట్టిన సర్వేలో తేలిందట. అందుకే ఆ పార్టీ కన్ను ఇప్పుడు సన్యాసి పాత్రుడు మీద ఉంది. అంతేకాదు.. టీడీపీ ఓట్లు కూడా చీలిపోతాయి. దీంతో.. నియోజకవర్గాన్ని తమ గుప్పెట్లో తెచ్చుకోవచ్చని వారు భావిస్తున్నారు.
వైసీపీ ఆఫర్ కి సన్యాసిపాత్రుడు కూడా సముఖంగానే ఉన్నాడు. కాకపోతే తనకు టికెట్ కేటాయిస్తాను అంటేనే పార్టీలో చేరతాను అని షరతు పెట్టారట. టికెట్ విషయం మాత్రం జగన్ చేతిలో ఉందని స్థానిక నేతలు ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో పట్టుసాధిస్తే.. దీని ప్రభావం పక్క నియోజకవర్గాలపై కూడా పడుతుందని వైసీపీ యోచిస్తోంది.
ప్రస్తుతానికి ఈ విషయంపై సన్యాసి పాత్రుడితో వైసీపీ నేతలు ఇంకా చర్చలు కొనసాగిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.