ఎన్ 440 కే రగడ: టీడీపీ నేతల ఫిర్యాదులపై మంత్రి అప్పలరాజు స్పందన
ఆంధ్రప్రదేశ్లో ఎన్440కే రకం వైరస్పై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ- వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై ఫైరయ్యారు మంత్రి సిదిరి అప్పలరాజు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్440కే రకం వైరస్పై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ- వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై ఫైరయ్యారు మంత్రి సిదిరి అప్పలరాజు.
ఏపీలో జరుగుతున్నంత నీచ రాజకీయాలు దేశంలో ఎక్కడా లేవని ఆయన మండిపడ్డారు. రుయా ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని అప్పలరాజు తెలిపారు. రుయా ఆసుపత్రి ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
కాగా, నిన్న గుంటూరు జిల్లా నరసరావుపేట టూ టౌన్, వన్ టౌన్, రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో మంత్రి అప్పలరాజుపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ లో సీనియర్ న్యాయవాది గుండాల సురేష్, టూ టౌన్లో నరసరావుపేట తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరి శేఖర్ నరసరావుపేట రూరల్ స్టేషన్లో సీతారామయ్య ఫిర్యాదు చేశారు. ఏపీలో N440K కరోనా మ్యూటెంట్ పదిహేను రెట్లు ఎక్కువ వేగంగా వ్యాపిస్తుందంటూ మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read:ఎన్440కే రగడ: నరసరావుపేటలో మంత్రి అప్పలరాజుపై టీడీపీ ఫిర్యాదు
అంతకుముందు కర్నూలులోనూ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదైంది. కర్నూలులో ఎన్440కె రకం కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని మంత్రి తొలుత చెప్పారని, అది చాలా ప్రమాదకరమైనదని ఓ చర్చా కార్యక్రమంలో కూడా అన్నారని టిడిపి నేతలు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి అప్పలరాజుపైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
మంత్రి అప్పలరాజుపై కర్నూలు ఒకటవ, 3వ పట్టణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని ఇతర పోలీస్ స్టేషన్లలోనూ, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేయాలని టిడిపి శ్రేణులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కొత్త రకం కరోనా వ్యాపిస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయనపై ఇప్పటికే కర్నూలులో కేసు నమోదైన సంగతి తెలిసిందే.