యువభేరికి హాజరైతే క్రిమినల్స్ అవుతారా ?
- ‘జగన్ యువభేరికి హాజరయ్యే వాళ్ళు క్రిమినల్స్ గా మారే అవకాశం ఉంది’...ఇవి తాజాగా అనంతపురంలో జరిగిన యువభేరిపై మంత్రి స్పందన.
- యువభేరి సందర్భంగా జగన్ లేవనెత్తిన అంశాలపై మాట్లాడకుండా వ్యక్తిగతంగా జగన్ ను టార్గెట్ చేయటమే మంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు.
- యువభేరి కార్యక్రమంలో జగన్ మాట్లాడిన మాటలకు, మంత్రి లేవనెత్తిన అంశాలకు ఏమాత్రం సంబంధం లేదు.
‘జగన్ యువభేరికి హాజరయ్యే వాళ్ళు క్రిమినల్స్ గా మారే అవకాశం ఉంది’...ఇవి తాజాగా అనంతపురంలో జరిగిన యువభేరిపై మంత్రి స్పందన. విచిత్రంగా ఉన్నా మంత్రి నక్కా ఆనందబాబు మాత్రం అలానే అంటున్నారు. యువభేరి సందర్భంగా జగన్ లేవనెత్తిన అంశాలపై మాట్లాడకుండా వ్యక్తిగతంగా జగన్ ను టార్గెట్ చేయటమే మంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. యువభేరి కార్యక్రమంలో జగన్ మాట్లాడిన మాటలకు, మంత్రి లేవనెత్తిన అంశాలకు ఏమాత్రం సంబంధం లేదు.
మంత్రికి చేతనైతే ప్రత్యేకహోదా ఎందుకు అవసరం లేదో వివరణ ఇవ్వాలి. లేకపోతే హోదాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రానికి కేంద్రం ఇప్పటి వరకూ ఏమిచ్చిందో చెప్పాలి. అంతేకానీ జగన్ క్రిమినల్, అవినీతిపరుడు, లక్షల కోట్లు దోచేసుకున్నాడు..లాంటి అర్ధంలేని ఆరోపణలను ప్రస్తావించటం విచిత్రంగా ఉంది. చంద్రబాబునాయుడు ప్రత్యేకప్యాకేజికి చట్టబద్దత గురించి పదేపదే ప్రస్తావిస్తున్న కేంద్రం స్పందించని విషయం వాస్తవం కాదా? ప్రత్యేకహోదా పక్కన బెట్టినా, కనీసం ప్రత్యేక ప్యాకేజి కూడా చట్టబద్దత సాధించలేనందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి.
పైగా మంత్రి మాట్లాడుతూ, జగన్ యువభేరికి హాజరయ్యే వాళ్ళు క్రిమినల్స్ గా మారే అవకాశం ఉందన్నారు. క్రిమినల్స్ గా ఎలా మారుతారో మాత్రం చెప్పలేదు. జగన్ ను తక్కువ చేసి మాట్లాడాలన్న ఆత్రంలో మంత్రి మొత్తం యువతనే అవమానిస్తున్న విషయాన్ని మరచిపోయినట్లున్నారు. అంతేకాకుండా కేంద్రప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీతో అంటకాగాలని జగన్ నానా అవస్తలు పడుతున్నారట. పోయిన ఎన్నికల సమయంలో భాజపాతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు పడిన అవస్తలు అందరూ చూసిందే.
తనపై ఉన్న కేసుల గురించి జగన్ భయపడుతున్నట్లు ఆరోపించారు. కేసుల విచారణ వేగవంతమైతే కచ్చితంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. జగన్ కేవలం ఈ రోజు బెయిలుపైన బయటున్నట్లు మంత్రి ఎద్దేవా చేసారు. 12 కేసుల్లో ప్రధమ ముద్దాయిగా చార్జిషీటును ఎదుర్కొటున్న జగన్ పాదయాత్ర చేయాలన్నా కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్ధితిలో ఉన్నట్లు గుర్తు చేసారు. అటువంటి జనగ్ ప్రజలకు ఏం చేస్తారు ? ప్రజలను ఏం ఉద్ధరిస్తాడు? అంటూ మాట్లాడటం విచిత్రంగా ఉంది.
అనంతపురంలో యువకులను ఉద్దేశించి ప్రత్యేకహోదా కోసం యువతను ఉద్దేశించి మాట్లాడటమన్నది సిగ్గుమాలిన చర్యగా మంత్రి వర్ణించారు. జగన్ చూసి యువకులు ఏం నేర్చుకోవాలంటూ మంత్రి ప్రశ్నించారు. ఇంతచిన్న వయస్సులోనే అవినీతితో లక్షల కొట్లు సంపాదించి కేసులను ఎదుర్కొంటున్న యువనాయకుడు భారతదేశం మొత్తం మీద ఎవరైనా ఉన్నారా ? అంటూ ప్రశ్నించారు.