ఏపీకి పెట్టుబడులు రావొద్దనేది టీడీపీ కోరిక.. మంత్రి అంబటి రాంబాబు ఫైర్
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావొద్దనేది టీడీపీ కోరిక అని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావొద్దనేది టీడీపీ కోరిక అని విమర్శించారు. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ను మంత్రి అంబటి రాంబాబు శనివారం సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులు ప్రారంభం కాకుండా టీడీపీ నేతలు తపస్సులు, పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకుండా కేంద్రానికి టీడీపీ నేతలు లేఖలు రాస్తున్నారని ఆరోపించారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కూరుకుపోవడంతో 700 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్లిందని మంత్రి అంబటి చెప్పారు. వరద ప్రవాహంతో స్టాప్ లాక్ ఏర్పాటు చేయలేకపోయామని తెలిపారు. కొన్ని గేట్లు బాగాలేవని నివేదిక ఇవ్వడంతో మరమ్మతులు చేపట్టినట్టుగా చెప్పారు. అవసరమైతే నాగార్జున సాగర్ నీటితో రిజర్వాయర్ను నింపుతామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అన్నీ ప్రాజెక్టుల్లో గేట్లు రిపేర్లలో ఉన్న మాట వాస్తవం మంత్రి అంబటి రాంబాటు అంగీకరించారు. గత ప్రభుత్వం డ్యామ్లను అశ్రద్ద చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ విషయంలో కొందరు కావాలని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.