గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. ఓ వ్యక్తి తమ ఏరియాలో రోడ్ల గురించి మంత్రిని ప్రశ్నించారు. దీనికి సహనం కోల్పోయిన అంబటి .. టీడీపీ వాళ్లకి రోడ్లు ఎందుకు వేస్తామంటూ ఎదురు ప్రశ్నించారు 

గడప గడపకూ మన ప్రభుత్వం (gadapa gadapaku mana prabhutvam) కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతోన్న వైసీపీ నేతలు, మంత్రులకు ప్రజల నుంచి నిరసన సెగ వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును (ambati rambabu) ప్రజలు నిలదీశారు. దీంతో ఆయన సహనం కోల్పోయి జనం మీద ఫైరయ్యారు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా పరిధిలోని సత్తెనపల్లి ఎమ్మెల్యేగా వున్న అంబటి... సోమవారం గడప గడపకులో భాగంగా సోమవారం రాజుపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తమ ఏరియాలో రోడ్ల గురించి మంత్రిని ప్రశ్నించారు. దీనికి సహనం కోల్పోయిన అంబటి .. టీడీపీ వాళ్లకి రోడ్లు ఎందుకు వేస్తామంటూ ఎదురు ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ (telugu desam party) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

ఇదే కాదు.. అదే గ్రామానికి చెందిన మరికొందరు కూడా మంత్రి అంబటి రాంబాబును నిలదీశారు. ఓ దివ్యాంగురాలు తనకు మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదని వాపోయింది. దీనిపై ఆయన అధికారులను వివరణ కోరగా.. 4 కరెంట్ మీటర్లు వున్నందున బాధితురాలికి పెన్షన్ అందడం లేదని తెలిపారు. ఆమెకు సమాధానం చెప్పిన మంత్రి ముందుకు వెళ్తుండగా మరో వ్యక్తి.. వైసీపీ ప్రభుత్వం తమకు ఏం చేయడం లేదంటూ ఫైర్ అయ్యారు. ఒకరి తర్వాత మరొకరు తనను ప్రశ్నిస్తూ వుండటంతో అంబటి రాంబాబు సహనం కోల్పోయి కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళ్లిపోయారు. 

Also REad:ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంకు చేదు అనుభవం

ఇకపోతే.. గతవారం మంత్రి గుమ్మనూరు జయరాంకు కూడా చేదు అనుభవం ఎదురైంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలో మంత్రి జయరాం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అయితే అక్కడ మంత్రి జయరాంకు నిరసన సెగ తగిలింది. కైరుప్పలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహిళలు, గ్రామస్తులు.. ఖాళీ బిందెలతో మంత్రి జయరాంను చుట్టుముట్టారు. కైరుప్పలో కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడాలేదని గ్రామస్థులు ఆయనను నిలదీశారు. ఈ క్రమంలోనే స్పందించిన మంత్రి.. 20 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

గతంలో కూడా మంత్రి జయరాంకు (gummanur jayaram) ఇలాంటి పరిస్థితి ఎదురైన సంగతి తెలిసిందే. మే నెలలో మంత్రి జయరాం జిల్లా అలూరు మండలం హాత్తిబెళగల్ గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. అమ్మ ఒడి లేకున్నా సరే.. రోడ్డు వేయించాలని మంత్రిని స్థానికులు నిలదీశారు. తమకు అమ్మఒడి రాలేదని చెప్పిన కొందరు మహిళలు.. అదిపోయిన తమకు రోడ్లు వేయించాలని కోరారు. అంతేకాకుండా మంత్రి ముందు పలు సమస్యలను ప్రస్తావించారు. త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో మంత్రి వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

Scroll to load tweet…