కాపుల కోసం మంత్రి పదవిని, రాజకీయ జీవితాన్ని వదులుకున్నారు.. ముద్రగడపై విమర్శలా : పవన్పై అంబటి ఫైర్
కాపులకు నిజంగా అండగా నిలబడింది ముద్రగడ పద్మనాభమేనని తెలిపారు మంత్రి అంబటి రాంబాబు. కాపుల కోసం మంత్రి పదవిని, రాజకీయ జీవితాన్ని వదులకున్నారని ఆయన వెల్లడించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు పేదవాడికి, పెత్తందార్లకు మధ్యనే జరగనున్నాయన్నారు. జరిగితే కురుక్షేత్ర యుద్ధమేనన్న ఆయన.. విజయం పేదవాడిదేనని జోస్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే రామోజీరావు అతిపెద్ద వైట్ కాలర్ నేరస్తుడని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని.. కానీ చట్టం తన పని తాను చేసకుంటూ పోతుందని మంత్రి హెచ్చరించారు. అక్రమార్జనతోనే రామోజీరావు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
కాపులకు ఆపద వచ్చినప్పుడు ముద్రగడ పద్మనాభం అండగా నిలబడ్డారని.. ఇందుకోసం తన రాజకీయ జీవితాన్ని సైతం ఆయన పణంగా పెట్టారని రాంబాబు గుర్తుచేశారు. వంగవీటి మోహన రంగా మరణానికి ముందు తెలుగుదేశానికి రాజీనామా చేశారని అంబటి తెలిపారు. ఎన్టీఆర్ మహానాడు పెట్టిన కృష్ణానది ఒడ్డునే కాపు నాడు జరిగిందని ఆయన వెల్లడించారు. వంగవీటి మోహన రంగాను టీడీపీ ప్రభుత్వం హతమార్చేందుకు కుట్ర పన్నుతోందని.. ఆయనకు ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని నాడు కాపు పెద్దలు హెచ్చరించారని అంబటి రాంబాబు గుర్తుచేశారు. ఆ సభకు తాను ప్రేక్షకుల్లో ఒకడిగా వున్నానని వెల్లడించారు.
Also Read: పవన్పై వ్యాఖ్యలు .. ఇన్నాళ్లు పెద్దమనిషివని అనుకున్నా : ముద్రగడకు హరిరామ జోగయ్య కౌంటర్
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ముద్రగడ పద్మనాభం వేదిక మీదకు వచ్చారని అంబటి రాంబాబు వెల్లడించారు. అలాంటి వ్యక్తి మీద కాపు కులాన్ని వాడుకున్నారని పవన్ నిందలు వేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని అంటారని.. కానీ చంద్రబాబును సీఎం చేయాలనేది పవన్ తాపత్రాయమని అంబటి రాంబాబు ఆరోపించారు. రోజు రోజుకు పవన్ గ్రాఫ్ పడిపోతోందని.. అయిన మాటల వల్లే ఇలా జరుగుతోందని మంత్రి చురకలంటించారు. రాజకీయాల్లో హత్యలుండవని.. అన్ని ఆత్మహత్యలేనని, పవన్ విషయంలోనూ అదే జరుగుతుందని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.