డయాఫ్రం వాల్ కొన్ని చోట్ల దెబ్బ తిన్నదని.. అయితే కొత్తది నిర్మించాలా లేక పాత దానికే మరమ్మతులు చేయాలా అన్నది త్వరలో నిర్ణయిస్తామన్నారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.
రాష్ట్రంలో వరద పరిస్ధితిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తుందన్నారు. ఇది 8 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని.. పట్టిసీమ ద్వారా మళ్ళీ కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించినట్లు రాంబాబు చెప్పారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇవ్వక తప్పని పరిస్థితి వుందన్నారు.
పులిచింతలలో నీటిని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ ఉంచుతామని రాంబాబు తెలిపారు. నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా 5 టీఎంసీల నీరు ఇవ్వాలనీ నిర్ణయించారు. డయాఫ్రం వాల్ కొన్ని చోట్ల దెబ్బ తిన్నదని.. అయితే కొత్తది నిర్మించాలా లేక పాత దానికే మరమ్మతులు చేయాలా అన్నది త్వరలో నిర్ణయిస్తామన్నారు. కేంద్ర జలసంఘానికి నివేదిక ఇవ్వలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ALso Read: జగన్కు మరో తలనొప్పి, సత్తెనపల్లి వైసీపీలో అసమ్మతి గళం.. మంత్రి అంబటికి వ్యతిరేకంగా సీక్రెట్ భేటీ
విశాఖలో ఇంటర్నేషనల్ కమిషన్ అన్ ఇరిగేషన్, డ్రైనేజ్ సంస్థ నవంబర్ 1 నుంచి 8 తేదీ వరకూ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ప్రధాని లేదా రాష్ట్రపతి వచ్చే అవకాశం ఉందని అంబటి రాంబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం , ఏపీ ప్రభుత్వం కలిసి ఈ సమావేశం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని మంత్రి చెప్పారు. మూడేళ్లకు ఓ మారు జరిగే ఈ సంస్థ సమావేశాలు నిర్వహిస్తోందని అంబటి తెలిపారు. కరోనా కంటే ముందు ఈ సమావేశం ఆస్ట్రేలియాలో జరిగిందని.. ఈ ఏడాది విశాఖలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. నీటి నిర్వహణ యాజమాన్యం తదితర అంశాల పై 8 రోజుల పాటు సదస్సు జరుగుతుందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
