ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఆయన జీవితంలో ఎప్పుడూ నిజాలు చెప్పరని.. మేనిఫెస్టో కూడా దాచేశారంటూ సెటైర్లు వేశారు. చిన్నచిన్న ఘటనలను పెద్దదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడప గడపకు మన ప్రభుత్వానికి (gadapa gadapaku mana prabhutvam) ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్న మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) . ఆదివారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. మూడేళ్లలో ప్రతి కుటుంబానికి ఏం లబ్ధి జరిగిందో చెబుతున్నామని అంబటి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నామన్నారు. మ్యానిఫెస్టోను కూడా దాచేసిన ఘనత చంద్రబాబుదంటూ (chandrababu naidu) అంబటి దుయ్యబట్టారు.
తన జీవితంలో నిజాలు చెప్పని ఏకైక వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. వైసీపీ పాలన (ysrcp) పట్ల ప్రజలు సంతృప్తిగా వున్నారని ... గడప గడపకు కార్యక్రమం ద్వారా ఆ విషయం తెలుస్తోందని అంబటి అన్నారు. చంద్రబాబు చేసిన బకాయిలను తమ ప్రభుత్వ తీర్చిందని.. గత ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి తేడా ప్రజలు తెలుసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చిన్నచిన్న ఘటనలను పెద్దదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని.. ఎల్లో మీడియా అవాస్తవ ప్రచారం చేస్తోందని రాంబాబు ఆరోపించారు. పథకం ప్రకారం ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
ఇకపోతే.. అసెంబ్లీ ఎన్నికలకు (ap assembly elections 2024) సమయం దగ్గరపడుతుండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) 'గడప గడపకు వైసీపీ' (gadapa gadapaku ycp) అనే కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని చోట్ల ఈ కార్యక్రమంలో మంత్రులు, వైసీపీ నేతలకు నిరసన సెగ తగులుతోంది. తమ వద్దకు వస్తున్న ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తూ.. ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో సొంత పార్టీలోనే వైసీపీకి వ్యతిరేకత ఎదురైంది. గడప గడపకు నిర్ణయంపై బొబ్బిలి వైసీపీ కౌన్సిలర్ రామారావు నాయుడు మండిపడ్డారు. అభివృద్ధి జరగకుండానే గడప గడపకు ఎలా వెళ్లగలనని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్లగలమని రామారావు నాయుడు ప్రశ్నించారు. ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని బహిరంగంగానే విమర్శించారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
