రంజాన్ నెల అయినా... కరోనా నిబంధనలు తప్పనిసరి..: వైద్యారోగ్య మంత్రి నాని
రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా ముస్లీంలకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఆళ్ల నాని కరోనా నిబంధనలు పాటిస్తూనే ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు.
అమరావతి: దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో ముస్లీం సోదరులు కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రార్థనలు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సూచించారు. రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పలు ముందస్తు జాగ్రత్తలు సూచించారు.
''ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలి. రాష్ట్రంలో గంగాజమునా తహజీబ్ మరింతగా పరిఢవిల్లాలని, సోదరభావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని అభిలషిస్తున్నాను'' అన్నారు.
''మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారన్నారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్యమాసాన్ని ముస్లిం సోదర సోదరిమణులంతా జరుపుకుంటారు... వారికి అల్లాహ్ దీవెనలు లభించాలి'' అని నాని ఆకాంక్షించారు.
''రంజాన్ అంటే ఉపవాసదీక్ష మాత్రమే కాదు... మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప దీక్ష. అన్ని రంగాల్లో ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారి జీవితాల్లో గుణాత్మక అభివృద్ధికి బాటలు వేస్తుండడం సంతృప్తిగా వుంది'' అని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.
ఇక రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం వైయస్ జగన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్యమాసాన్ని ముస్లిం సోదర సోదరిమణులంతా జరుపుకుంటారని, వారికి అల్లాహ్ దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షించారు.