మావి గొంతెమ్మ కోర్కెలు కావు- ఏపీ ఉద్యోగ జేఏసీ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఏపీ జేేఏసీ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బుధవారం నిరసనలు తెలిపారు.
తమవి గొంతెమ్మ కోర్కెలు కావని ఏపీ ఉద్యోగ జేఏసీ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉద్యోగ జేఏసీ, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్బంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. తమ సమస్యలపై స్పందించాలని అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో పోరుబాట పట్టారని చెప్పారు. ఆర్ధిక ఇబ్బందులు పేరు చెప్పి ప్రభుత్వం తప్పించుకోవడం సరైన పద్దతి కాదని అన్నారు. దీనిపై సీఎం ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఎవరో ఎక్కడో ఏదో చెబితే పరిగణలోకి ఎలా తీసుకోవాలని ప్రశ్నించాలి. ఉద్యోగులకు సంబంధించిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. అనారోగ్యానికి గురైతే ఉద్యోగుల డబ్బుతోనే వైద్యం చేసుకోమని అంటున్నారని, ఇది చాలా బాధకరమని అన్నారు. హాస్పిటల్స్ బిల్లును కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. ఇప్పటికే రూ.23 కోట్ల హాస్పిటల్స్ బిల్స్ పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. పీఆర్సీ ఒకటే తమ డిమాండ్ కాదని అన్నారు. ఇంకా 70 డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. మిగిలిన ఇతర డిమాండ్లపై సీఎం స్పందించాల్సి ఉందని అన్నారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, తమవి న్యాయమైన డిమాండ్ లు అని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్చలకు పిలిచి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నిరసనలు, ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పారు.