డబ్బులున్న అమ్మాయిలే టార్గెట్... 11 మందితో పెళ్లి పేరుతో ఛాటింగ్..రూ.3 కోట్లకు టోకరా !
చిత్తూరు జిల్లాలోని నరసింగరాయనిపేట, మదనపల్లె రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లలో కూడా మహిళలను చీటింగ్ చేసినట్లు కేసులు నమోదు చేయడంతో పోలీసులు విచారించారు. చిత్తూరు తాలూకా పోలీసులు నిందితుడి కోసం గాలించి సోమవారం పట్టుకున్నారు.
మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాప్ ల ద్వారా అమ్మాయిల ప్రొఫైల్ చెక్ చేస్తాడు. వారితో చాటింగ్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు. కష్టాలు ఉన్నాయని డబ్బులు అడుగుతాడు. ఇలా 11 మంది అమ్మాయిలను మోసం చేసి వారి నుంచి మూడు కోట్లు కొట్టేశాడు ఓ ఘరానా కేటుగాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్, డిఎస్పి సుధాకర్ రెడ్డి తో కలిసి సోమవారం విలేకరులకు ఈ కేసు వివరాలను వెల్లడించారు. కాన్పూర్లో ఎంటెక్ చదువు మధ్యలో మానేసిన నిందితుడు పున్నాటి శ్రీనివాస్ ది ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలం కోటికాలపూడి గ్రామం. ఇతడిపై ఇప్పటికే సైబరాబాద్ లోని మియాపూర్, రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
తాజాగా చిత్తూరు జిల్లాలోని నరసింగరాయనిపేట, మదనపల్లె రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లలో కూడా మహిళలను చీటింగ్ చేసినట్లు కేసులు నమోదు చేయడంతో పోలీసులు విచారించారు. చిత్తూరు తాలూకా పోలీసులు నిందితుడి కోసం గాలించి సోమవారం పట్టుకున్నారు.
ఒక్కో అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఒక్కో సిమ్ కార్డును ఉపయోగిస్తాడు అని విచారణలో తేలింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో.. ఒంగోలుకు చెందిన ఐటీ ఉద్యోగిని రూ. 27 లక్షలు ,నరసరావుపేటకు చెందిన ఐటీ ఉద్యోగిని రూ. 40 లక్షలు, చిత్తూరుకు చెందిన ఐటీ ఉద్యోగిని రూ.1.40 లక్షలు, మదనపల్లెకు చెందిన యువ వైద్యురాలు రూ. 7 లక్షలు.. నిందితుడు ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. మరో ఏడుగురు అమ్మాయిలు కూడా మోసపోయినట్లు తెలుస్తున్నా.. వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది.