సంసారానికి పనికిరాడని తెలిసికూడా కొడుకును అంటగట్టి అత్తామామలు తన జీవితాన్ని నాశనం చేసారంటూ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులోని కృష్ణా నది ఒడ్డున వివాహిత ఆందోళనకు దిగింది.
విజయవాడ: తన భర్త దాంపత్య జీవితానికి పనికిరాడని... ఈ విషయం తెలిసికూడా కొడుకుతో తనకు పెళ్ళి చేసి అత్తామామలు జీవితాన్ని నాశనం చేసారంటూ ఎన్టీఆర్ జిల్లాలో ఓ వివాహిత ఆందోళన చేపట్టింది. అత్తింటివారి వేధింపుల నుండి కాపాడి తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ పుట్టింటివారితో కలిసి బాధిత మహిళ కృష్ణా నది ఒడ్డున నిరాహారదీక్షకు కూర్చుంది.
వివరాల్లోకి వెళితే... పెళ్ళయిన నాటినుండి భర్త ఇప్పటివరకు తనతో శారీరకంగా కలవలేదని బాధితురాలు నవ్యత తెలిపింది. ప్రతిరోజూ ఇలాగే భర్త దగ్గరకు రాకపోవడంతో అనుమానం వచ్చి అత్తామామలకు విషయం తెలిపానని... ఈ విషయాన్ని వాళ్లు చాలా ఈజీగా తీసుకున్నారని పేర్కోంది. దీన్నిబట్టి వారికి కొడుకు సంసారానికి పనికిరాడని ముందుగానే తెలుసని అర్థమయ్యిందని... పరువుపోతుందని ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని వివాహిత తెలిపింది.
Video
కొడుకు విషయం తెలిసికూడా తనతో పెళ్లిచేసి జీవితాన్ని నాశనం చేసారని నవ్యత ఆవేదన వ్యక్తం చేసింది. భర్త విషయం తెలిసి విడాకులు కావాలని అత్తింటివారిని అడిగానని... గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి రూ.15లక్షలు ఇస్తానని ఒప్పుకున్నారని బాధిత మహిళ తెలిపింది. కానీ ఆ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని వివాహిత ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పుడు రివర్స్ లో తనపైనే కోర్టులో పరువునష్టం దావా వేసారని నవ్యత తెలిపింది. తన జీవితాన్ని నాశనం చేయడమే కాదు ఇప్పుడు కోర్టుకెక్కిన భర్త, అత్తామామల నుండి రక్షణ కల్పించాలని... గతంలో ఒప్పుకున్న డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేస్తోంది. అప్పటివరకు ఆందోళన విరమించేది లేదని నవ్యత తేల్చిచెప్పింది.
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులోని కృష్ణా నది ఒడ్డున కుటుంబసభ్యులతో కలిసి వివాహిత నిరసన దీక్ష దిగింది. తమకు న్యాయం జరిగే వరకూ కృష్ణా నదిలో నీళ్ళు తాగి నిరసన చేపడతామని బాధితురాలు నవ్యతతో పాటు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.
