తండ్రి వద్దని వారిస్తున్నా.. భర్త దగ్గరికి వెళ్లి.. చివరికి శవమై తేలి....
చిత్తూరు జిల్లాలో ఓ వివాహిత భర్త దగ్గరికి వెడతానని బయలు దేరి శవమై తేలిన ఘటన కలకలం రేపింది. తండ్రివద్దని చెబుతున్నా.. అత్తగారింటికి వెళ్లిన ఆమె ఐదు రోజుల తరువాత విగతజీవిగా కనిపించింది.
చిత్తూరు : చిత్తూరు మండలంలోని బిఎన్ఆర్పేట చెరువులో గుర్తు తెలియని మహిళ శవం ఐదు రోజుల క్రితం లభ్యమైంది. ఆ శవం బిఎన్ఆర్ పురం గ్రామానికి చెందిన మోహన అలియాస్ రోజా (23)గా మంగళవారం తేలింది. దీంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిఎన్ఆర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రోజా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో... ఆమె భర్త ప్రకాష్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇక మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం ఆ మహిళ తల్లిదండ్రులకు అప్పగించారు. సాయంత్రానికి జీడీ నెల్లూరు మండలం నల్లరాళ్ల పల్లెలో కుటుంబీకులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
వద్దన్నా వెళ్ళింది..
రోజా ఇంటి నుంచి వెళ్లిన తర్వాత జరిగిన సంఘటనలli ఆమె తండ్రి చిన్నబ్బ మందడి మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు, భర్త దగ్గరకు వెళ్లొద్దని తండ్రి చెప్పినా, గత శుక్రవారం ఇంటి నుంచి వీఎన్ పురానికి రోజా వెళ్ళింది. శుక్రవారం సాయంత్రం నుంచి రోజా కోసం ఆమె భర్త కు ఫోన్ చేస్తే తీయలేదు. శనివారం ఉదయం ఫోన్ చేస్తే పని మీద బయట ఉన్నాను అని.. ఇంటికి వెళ్లి ఫోన్ చేస్తా అని బదులిచ్చాడు.
సాయంత్రానికి కూడా ఫోన్ చేయకపోవడంతో.. ప్రకాష్ తండ్రికి ఫోన్ చేయడంతో అక్కడికి రాలేదని చెప్పాడు. దీంతో బంధువులు ఊర్లలో వెతికినా రోజా ఆచూకి తెలియలేదు. ఇంటికి తిరిగి వచ్చాక పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని గ్రామస్తులు తెలపడంతో, బిఎన్ఆర్ పేట స్టేషన్కు వెళ్లారు. అక్కడ వారు చూపించిన టవల్, ఎరుపు రంగు చున్నీ, తాళిబొట్టు, చేతికి ధరించిన దేవుడి దారం, మెడలో నల్లపూసల దారంతో రోజాగా గుర్తించారు. ఆమెను భర్తే చంపేశాడు అని తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా, తమిళనాడులోని కుంభకోణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన కొత్తగా పెళ్లైన వధువును ఆమె సోదరుడు విందు ఏర్పాటు చేసి, ఇంటికి పిలిచాడు. విందుకు వచ్చిన ఆమెను, ఆమె భర్తను కర్కశంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెడితే.. నర్సుగా పనిచేస్తున్న 23 ఏళ్ల శరణ్యకు ఘటనకు ఐదు రోజుల క్రితం మోహన్తో వివాహమైంది. పెళ్లికి ముందు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి తీసుకోవాల్సి రావడంతో దంపతులు సోమవారం వారి ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే శరణ్య సోదరుడు శక్తివేల్ దంపతులను తన ఇంటికి విందుకు పిలిచాడు. విందు అనంతరం దంపతులు బయలుదేరడానికి సిద్ధం అవుతుండడంతో.. శక్తివేల్, అతని బావ రంజిత్లు కొడవళ్లు తీసి మోహన్ను నరికి చంపారు. అది చూసి షాక్ అయిన శరణ్య తేరుకుని సహాయం కోసం అరిచేలోపే ఆమె మీద కూడా దాడి చేశారు. ఆమెను నరికి చంపేశారు.
అనంతరం శక్తివేల్, రంజిత్లు కుంభకోణం టౌన్ పోలీసులకు లొంగిపోయారు. తన బావమరిది రంజిత్తో శరణ్య పెళ్లి చేయాలని శక్తివేల్ యోచిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, అయితే అతని ఇష్టం లేకుండా శరణ్య మోహన్ని పెళ్లి చేసుకుందని.. దీంతో ఆగ్రహించిన శక్తివేల్.. నమ్మించి హత్యలు చేశాడని తేలింది. మోహన్, శరణ్య మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపరీక్ష నిమిత్తం కుంభకోణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది.