చిత్తూరు: అత్తారింటి ముందే నిప్పంటించుకున్న వివాహిత.. సజీవ దహనం
చిత్తూరు జిల్లా పలమనేరులో అత్తవారి ఇంటి ముందే ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యను కాపాడేయత్నంలో హరిప్రసాద్ రెడ్డి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లా పలమనేరులో విషాదం చోటు చేసుకుంది. అత్తవారి ఇంటి ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది వివాహిత. మునిపల్లె గ్రామానికి చెందిన హరిప్రసాద్ రెడ్డి రెండేళ్ల క్రితం పుదుచ్చేరికి చెందిన సత్యవాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరిద్దరూ బెంగళూరులో కాపురం ఉంటున్నారు. అయితే కుటుంబ కలహాలతో ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. అయితే అత్తమామల ముందే భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. కోపంతో ఇంటి బయటకు వెళ్లిన సత్యవాణి అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో కాలి అక్కడికక్కడే సజీవదహనమైంది. భార్యను కాపాడేయత్నంలో హరిప్రసాద్ రెడ్డి తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.