కొట్టేసిన జీవోతో కోర్టుకెళ్లారు: ఊర్మిళ పిటిషన్ పై ఆశోక్గజపతిరాజు రియాక్షన్
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ పదవి నుండి తనను తప్పించాలని ఊర్మిళ గజపతిరాజు పిటిషన్ దాఖలు చేయడంపై మాజీ కేంద్ర మంత్రి ఆశోక్గజపతిరాజు స్పందించారు. కొట్టేసిన జీవోతో ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు.
విజయనగరం: కొట్టేసిన జీవోతో ఊర్మిళ గజపతిరాజు కోర్టును ఆశ్రయించిందని మాజీ కేంద్ర మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ ఆశోక్గజపతిరాజు చెప్పారు.ఆశోక్గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ పదవి నుండి తప్పించి తనను నియమించాలని ఊర్మిళ గజపతిరాజు ఏపీ హైకోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై మాజీ కేంద్ర మంత్రి ఆశోక్గజపతిరాజు స్పందించారు.
మంగళవారం నాడు ఓ తెలుగున్యూస్ ఛానెల్ తో ఆయన ఈ విషయమై స్పందించారు.ఎవరు చైర్మెన్ గా ఉండాలో ట్రస్ట్ డీడ్ లో స్పష్టంగా ఉందని ఆయన గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో ప్రభుత్వం సమాన హక్కు కల్పించిందన్నారు.ఆలయాలు ,మాన్సాస్ ట్రస్టులో సమాన హక్కులు కల్పించేందుకు అవి స్వంత ఆస్తులు కాదని ఆయన చెప్పారు. తన మీద ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని ఆయన ఆరోపించారు.విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు చట్టప్రకారంగా సహకరిస్తామని ఆయన చెప్పారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మెన్ గా సంచయిత గజపతిరాజు ఉన్న సమయంలో ఎందుకు విచారణ జరపలేదని ఆయన ప్రశ్నించారు.