ప్రేమ పెళ్లి.. కూతురిపై తండ్రి దాడి..!
సమీప బంధువులే అయినా, మంజు ఆటోడ్రైవర్ అన్న కారణంతో మల్లేశ్వరి తండ్రి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మల్లేశ్వరి పదిరోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయి మంజును ప్రేమ వివాహం చేసుకుంది.
ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో.. కూతురిపై ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో ఆదివారం చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నంద్యాల దేవనగర్కు చెందిన ఆంజనేయులు, మద్దమ్మ దంపతుల కూతురు మల్లేశ్వరి, దళితవాడకు చెందిన మంజు అలియాస్ చిరంజీవి నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయాన్ని ఇటీవల కుటుంబసభ్యులకు తెలపగా పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలూ ఒప్పుకోలేదు. సమీప బంధువులే అయినా, మంజు ఆటోడ్రైవర్ అన్న కారణంతో మల్లేశ్వరి తండ్రి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మల్లేశ్వరి పదిరోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయి మంజును ప్రేమ వివాహం చేసుకుంది.
కూతురిపై పగ పెంచుకున్న ఆంజనేయులు మాట్లాడుకుందామని కూతురిని ఇంటి కి పిలిపించాడు. ఆదివారం పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగానే ఆంజనేయులు కత్తితో కూతురిపై దాడి చేశాడు. ఆమె కుడి భుజానికి, కడుపులో గాయాలవడంతో కుటుంబసభ్యులు నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.