ప్రత్యేక హోదా కోసం సూసైడ్: ఎవరీ సుధాకర్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకొన్న నిమ్మన్నగారి సుధాకర్ పేరు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం సుధాకర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు
చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకొన్న నిమ్మన్నగారి సుధాకర్ పేరు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం సుధాకర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని కోరుతూ సుధాకర్ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకొన్నాడు. సుధాకర్ మృతికి సంతాపంగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం నాడు బంద్ నిర్వహిస్తున్నారు.
చిత్తూరు జిల్లా మదనపల్లెలోని గౌతమీనగర్కు చెందిన నిమ్మన్నగారి రామచంద్ర, సరోజనమ్మ దంపతుల కొడుకే సుధాకర్. వీరికి సుధాకర్ తో పాటు మరో ఇద్దరు కూతుళ్లు కూడ ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. వారిద్దరూ అత్తింట్లో ఉంటున్నారు. సుధాకర్ 8వ తరగతి వరకు చదువుకొన్నాడు. నేత కార్మికుడుగా పనిచేస్తున్నాడు.
సుధాకర్ తల్లిదండ్రులు రామచంద్ర, సరోజనమ్మలు మున్సిఫల్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. కురబలకోట మండలం ముదివేడు దిగువగొల్లపల్లెకు చెందిన ఈ కుటుంబం పదిహేనేళ్ల కిందట ఉపాధి నిమిత్తం మదనపల్లెకు వచ్చి స్థిరపడింది.
ఇతరుకు సహాయం చేసే తత్వం సుధాకర్ది. తన వద్ద డబ్బులు లేకున్నా తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూడ ఇతరులకు సహాయం చేసేవాడని సుధాకర్ గురించి తెలిసిన వారు చెబుతుంటారు. ప్రతి ఒక్కరికీ తనకు తోచిన రీతిలో సహాయం చేయడం సుధాకర్ కు అలవాటు.
గురుపౌర్ణమి సందర్భంగా ఓ అనాథఆశ్రమంలో కూడ సుధాకర్ అన్నదానం చేశారు. ఈ ఫోటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ సూసైడ్ లేఖ రాసి ఇంట్లోనే సుధాకర్ ఆత్మహత్య చేసుకొన్నాడు.
శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు సుధాకర్ ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని గుర్తించారు. సుధాకర్ మృతికి సంతాపంగా ఆదివాంరానడు మదనపల్లె బంద్ నిర్వహిస్తున్నారు. సుధాకర్ కుటుంబాన్ని ఆదుకొంటామని పలు పార్టీల నేతలు హమీ ఇచ్చారు.