రోడ్డు మీదున్న గుంతలో పడి బండి అదుపుతప్పి.. ఎగిరిపడడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. 

పశ్చిమ గోదావరి : పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి రోడ్డు మీద ఉన్న గోతిలో పడి మరణించాడు. ఈ ఘటన బుధవారం రాత్రి పశ్చిమ గోదావరిజిల్లా పెంటపాడు మండలం ముద్దునూరులోని రావిగుంట వద్ద చోటుచేసుకుంది. అత్తిలికి చెందిన కొండే వెంకట్రావు పెద్ద కుమారుడు ప్రవీణ్ కుమార్ (29) దక్షిణాఫ్రికాలో టెక్నీషియన్ పనిచేస్తున్నాడు. నాలుగు నెలల కిందట స్వగ్రామానికి వచ్చాడు. మరో వారం రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. బుధవారం రాత్రి బైక్ మీద అత్తిలి నుంచి తాడేపల్లిగూడెం బయలు దేరాడు.

రావిగుంట వద్ద రోడ్డుపై గోతులు కనిపించక.. అదుపుతప్పి.. ద్విచక్రవాహనంపై నుంచి ఎగిరి పడటంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పెంటపాడు నుంచి పిప్పర వరకు ఉన్న ఈ రహదారిని గతేడాది ఆర్అండ్ బి అధికారులు నాలుగు లైన్ల రహదారి గా ఆధునీకరించారు. మూడు నెలల కిందటే గోతులు పూడ్చారు. వర్షాలకు మళ్లీ గోతులు పడి భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదకరంగా మారింది. 

వైజాగ్ సాయిప్రియ మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్: బెంగళూరులో ప్రియుడితో పెళ్లి, తాళిబొట్టుతో పేరెంట్స్‌కు ఫోటో

అయితే, ఈ పరిస్థితి ఒక్క పశ్చిమగోదావరిలోనే కాదు.. దేశవ్యాప్తంగా రోడ్ల దుస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి రోడ్లకు నిరసనగా బెంగళూరులో రెండు రోజుల క్రితం ఓ సంస్థ వినూత్న నిరసనలు కూడా చేపట్టింది. 'చేంజ్‌మేకర్స్ ఆఫ్ కనకపుర రోడ్' అనే సంస్థ ఒక దున్నపోతుతో పాటు మృత్యుదేవత యమరాజు వేషధారణలో ఉన్న వ్యక్తితో బెంగళూరులో నిరసన ప్రదర్శన నిర్వహించింది. దీన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ వీడియోలో వెనకనుంచి నిరసనకారుల అరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ అరుపుల మధ్య యమధర్మరాజు వేషంలో ఉన్న వ్యక్తి.. గేదెతో పాటు రోడ్డు మధ్యలో నిలబడి కనిపిస్తున్నాడు. 

‘ఈ రోడ్డు గురించి చెప్పడానికి మేము యమధర్మరాజు థీమ్‌ను ఎంచుకున్నాం. ఎందుకంటే ఈ రహదారిని ఉపయోగించే ప్రయాణికులకు నరకం కనిపిస్తుంది. అందుకే ఇదే సరైన థీమ్ అనిపించింది. అని కనకపుర రోడ్‌కు చెందిన చేంజ్‌మేకర్స్ కు చెందిన అబ్దుల్ అలీమ్ అన్నారు. ఈ రోడ్డు గత పదేళ్లుగా అతి దారుణంగా ఉంది. ఇదొక్కటే కాదు అంజనాపురంలోని రోడ్లన్నీ ఒకేలా అధ్వాన్నంగా ఉన్నాయి. నిరుడు మేము చేసిన ప్రత్యేక నిరసన కొంత ఫలితాలిచ్చింది. అయితే, కేవలం 2 కిలోమీటర్ల రోడ్డు వేశారు. 13 కిలోమీటర్ల రోడ్డు కోసం 25 కోట్లు విడుదలయ్యాయి’’ అని కనకపుర రోడ్‌కు చెందిన చేంజ్‌మేకర్స్ తెలిపారు.

యమధర్మరాజు పేరు చెప్పి ఎమ్మెల్యే, బిడిఎ అధికారులను ఇంత అవమానించినా వారిలో చలనం లేదు. స్థానికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ రోడ్ల వల్ల అంబులెన్స్ కూడా రావడం వీలవక.. కారులో తరలించడంతో ఓ అపార్ట్ మెంట్ మృతి చెందాడని.. చెప్పుకొచ్చాడు. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బిడిఎ), స్థానిక ఎమ్మెల్యే ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని.. సమస్యను త్వరగా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉగ్ర నిరసనలు చేపడతామని అలీం హెచ్చరించారు.