Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో దారుణం... మంత్రి అవంతి కాన్వాయ్ ఢీకొని తాపీ మేస్త్రీ మృతి (వీడియో)

మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ లోని వాహనం ఢీకొని తాపీ మేస్త్రీ మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబంతో కలిసి సీఐటియూ ఆధ్వర్యంలో మంత్రి ఇంటిఎదుట ధర్నా చేపట్టారు.

Man dies after being hit by minister avanthi srinivasa convoy vehicle in visakhapatnam
Author
Visakhapatnam, First Published Nov 10, 2021, 4:57 PM IST

విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్  టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్  లోని ఓ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ దుర్ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబసభ్యులు సీతమ్మదారలోని మంత్రి ఇంటిముందు ఆందోళనకు దిగారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...minister avanthi srinivas కాన్వాయ్ ఎయిర్ పోర్టు నుండి వస్తోంది. ఈ క్రమంలో ఈ వాహనశ్రేణిలోని కారు బిర్లా కూడలి వద్ద ఓ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళుతున్న తాపీ మేస్త్రీ సూర్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. 

వేగంగా వెళుతున్న minister convoy లోని కారు ఢీకొట్టడంతో సూర్యనారాయణ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అయితే వెనకనుండి వచ్చిన మరోవాహనం అతడిపైనుండి వెళ్లడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

తాపీ మేస్త్రీగా పనిచేసే సూర్యనారాయణ మృతితో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. కాబట్టి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ సీతమ్మధారలోని మంత్రి అవంతి నివాసం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో బాధిత కుటుంబం నిరసనకు దిగింది.

వీడియో

"

ధర్నాకు దిగిన బాధిత కుటుంబంతో  మంత్రి అవంతి మాట్లాడారు. ప్రమాద సమయంలో వాహనంలో తాను లేనని... అయినప్పటికి మానవతా దృక్పథంతో బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని... ప్రస్తుతానికి ఆర్థిక సాయం అందిస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు. 

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని... విచారణలో పూర్తయితే అన్ని విషయాలను వారే వెల్లడిస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ధర్నా నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా మంత్రి అవంతి నివాసం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసారు. 

ఇక  ఇటీవల మంత్రి అవంతి రాసలీలకు సంబంధించిన ఆడియో అంటూ సోషల్ మీడియాలో ఓ ఆడియో రికార్డ్ చక్కర్లుకొట్టిన విషయం తెలిసిందే. ఓ మహిళతో మంత్రి ఫోన్లో అసభ్యంగా మాట్లాడుతున్నట్లుగా వున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఆడియో టేపుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో మంత్రి అవంతి స్వయంగా అది ఫేక్ ఆడియో అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేక కొందరు కుట్ర చేస్తున్నారని  ఆయన ఆరోపించారు.

తనను బాధ పెట్టాలని సోషల్ మీడియాలో అలా చేశారని మండిపడ్డారు.  తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు ఎవరితోనూ శత్రుత్వంలేదని వ్యాఖ్యానించారు. తనపై ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదన్నారు. చౌకబారు ఆరోపణలతో తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని... దీనిపై పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హాకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ద్వారా విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.  

ఈ వివాదం గురించి ఇంకా మరిచిపోకముందే మంత్రి కాన్వాయ్ ఢీకొని తాపీ మేస్త్రీ చనిపోయాడు. ఇలా మంత్రి అవంతిని ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే సంబంధంలేని వివాదాలు తనకు చుట్టుకుంటున్నాయని మంత్రి అవంతి పేర్కొంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios