కరోనా సోకిందంటూ గేలి.. తట్టుకోలేక
నాగన్న అతన్ని గ్రామంలో చనిపోకముందు పలకరించాడని అతనితో గ్రామస్తులు దూరంగా ఉంటూ వచ్చారు. ‘నీకు కూడా కరోనా వైరస్ సోకింది’దంటూ హేళన చేశారు.
కరోనా వైరస్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. వైరస్ సోకకముందే.. దాని అనుమానంతో మరికొందరు ప్రాణాలు కోల్పోతుండటం గమనార్హం. తాజాగా.. ఓ వ్యక్తి వైరస్ సోకిందనే అనుమానంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల పరిధిలోని ముప్పులకుంటలో గత ఐదు రోజుల క్రితం బోయ రామచంద్రప్ప కరోనా వైరస్తో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన చాకలి నాగన్న అతన్ని గ్రామంలో చనిపోకముందు పలకరించాడని అతనితో గ్రామస్తులు దూరంగా ఉంటూ వచ్చారు. ‘నీకు కూడా కరోనా వైరస్ సోకింది’దంటూ హేళన చేశారు.
దీంతో మనస్థాపానికి గురైన నాగన్న.. గురువారం మధ్యాహ్నం ముప్పులకుంట – కళ్యాణదుర్గం అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో పడి ఉండగా అటుగా వెళ్లిన పశువుల కాపరులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. స్థానికులు 108 వాహనంలో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.