మొదటిభార్యకు ఇద్దరు పిల్లలు ఉండగా , రెండో భార్యకు కుమారుడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి శ్రీనివాస్ ఒక గదిలో మంచంపై పడుకోగా, భార్య పిల్లలు పక్కనే ఉన్న గదిలో పడుకున్నారు.
ఓ వ్యక్తిని మంచానికి కట్టేసి.. ముఖం మొత్తం చిధ్రం చేసి.. తలపై బలమైన వస్తువుతో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పిఠాపురం లోని కోటవారి వీధిలో నివాసముంటున్న రెడ్డెం శ్రీనివాస్ (44) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని మొదటి భార్య చనిపోవడంతో.. ఎనిమిదేళ్ల క్రితం స్వరూప రాణి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. మొదటిభార్యకు ఇద్దరు పిల్లలు ఉండగా , రెండో భార్యకు కుమారుడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి శ్రీనివాస్ ఒక గదిలో మంచంపై పడుకోగా, భార్య పిల్లలు పక్కనే ఉన్న గదిలో పడుకున్నారు.
సోమవారం ఉదయం భార్య శ్రీనివాస్ పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి హత్యకు గురైనట్టు గుర్తించి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్య జరిగిన తీరు చూపరులను కలిచివేసింది. శ్రీనివాస్ను మంచానికి తాళ్లతో కట్టివేసి తలపై చెక్కతో లేదా బలమైన వస్తువుతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తలపూర్తిగా ఛిద్రమైంది.
కాగా.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసే సమయంలో శ్రీనివాస్ కేకలు వేయలేదా, పక్క గదిలో భార్య పిల్లలు ఉన్నా వారికి ఏం వినిపించలేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీనివాస్ కుటుంబంలో పరిస్థితి, ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. పోలీసు జాగిలాలు వచ్చి ఇంటి మేడ మీదకు వెళ్లి మళ్లీ బయటకు వచ్చేశాయి. దీంతో ఇంట్లోకి బయట వ్యక్తులు వచ్చారా, తెలిసినవారే ఈ దారుణానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
