తరగతి గదిలో... విద్యార్థులు చూస్తుండగానే టీచర్ మీద భర్త ఘాతుకం..
తణుకు లో దారుణం జరిగింది. ఓ టీచర్ మీద స్వయంగా భర్త తరగతి గదిలోనే కత్తితో దాడిచేసి హత్యాయత్నం చేశాడు. ఇరగవరం మండలం కాకిలేరు గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
తణుకు లో దారుణం జరిగింది. ఓ టీచర్ మీద స్వయంగా భర్త తరగతి గదిలోనే కత్తితో దాడిచేసి హత్యాయత్నం చేశాడు. ఇరగవరం మండలం కాకిలేరు గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
నారాయణపురం గ్రామానికి చెందిన గుత్తుల నాగలక్ష్మికి జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన కడలి రామ దుర్గాప్రసాద్ కు 2016లో వివాహమయ్యింది. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. అయితే భార్యభర్త ల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీచర్ అయిన నాగలక్ష్మికి గతనెల 16న కాకిలేరు శివారు సింగోడియన్ పేటలోని ఎంపీపీ పాఠశాలకు బదిలీ అయ్యింది. శుక్రవారం మద్యాహ్నం ఆమె భర్త రామదుర్గా ప్రసాద్ స్కూల్ హెడ్మాస్టర్ వెంకటాచార్యులు దగ్గరకు వచ్చి నాగలక్ష్మిని కలవాలని అడిగాడు.
ఆమె క్లాస్ రూంలో ఉందని చెప్పడంతో, క్లాస్ రూమ్ కి వెళ్లిన రామ దుర్గాప్రసాద్ విద్యార్థులు చూస్తుండగానే జుట్టు పట్టుకుని నేల్ కట్టర్లోని చాకుతో వీపుపై, పక్కటెముకల మీద దాడి చేశాడు. ఇది చూస్తున్న విద్యార్థులు భయాందోళనలతో గట్టిగా అరవడంతో హెడ్మాస్టర్ పరిగెత్తుకొచ్చారు.
వెంటనే ఎంఈఓ ఎస్ శ్రీనివాసరావు ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తుల సహకారంతో గాయపడిన నాగలక్ష్మిని పెనుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన తరువాత తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అయితే రామ దుర్గాప్రసాద్ మీద జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో వరకట్నం వేధింపుల కేసు ఉందని, ప్రస్తుత ఘటనమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.