Asianet News TeluguAsianet News Telugu

మదనపల్లి అక్కాచెల్లెళ్ల హత్య : ‘మా చేతులతో మేమే చంపుకొన్నామే...’ తండ్రి ఆవేదన...

‘చిన్నోడా సాయిదివ్యా.. పెద్దోడా అలేఖ్య లే.. నాన్న ఇంత బతిమాలుతున్నా కదా.. లెగండి అమ్మా’ అంటూ తండ్రి పురుషోత్తంనాయుడు బిడ్డలిద్దరి మృతదేహాలను పట్టుకొని విలపించడం అక్కడున్నవారందరినీ కలిచి వేసింది.  ‘మా చేతులతో మేమే మిమ్మల్ని చంపుకున్నామే’ అంటూ ఆ తండ్రి సోమవారం భోరుమన్నాడు. 
 

madanapalle double murder : father crying for daughters - bsb
Author
Hyderabad, First Published Jan 26, 2021, 12:02 PM IST

‘చిన్నోడా సాయిదివ్యా.. పెద్దోడా అలేఖ్య లే.. నాన్న ఇంత బతిమాలుతున్నా కదా.. లెగండి అమ్మా’ అంటూ తండ్రి పురుషోత్తంనాయుడు బిడ్డలిద్దరి మృతదేహాలను పట్టుకొని విలపించడం అక్కడున్నవారందరినీ కలిచి వేసింది.  ‘మా చేతులతో మేమే మిమ్మల్ని చంపుకున్నామే’ అంటూ ఆ తండ్రి సోమవారం భోరుమన్నాడు. 

ఆదివారం మధ్యాహ్నం సాయిదివ్య(22)కు దెయ్యం పట్టిందని తల్లి పద్మజ డంబెల్ తో కొట్టి చంపగా.. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు పెద్దకుమార్తె అలేఖ్య(27)ను నోట్లో రాగి చెంబు పెట్టి డంబెల్ తో కొట్టి హతమార్చింది. ఆదివారం రాత్రి మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయితీ శివనగర్ లో ఈ ఘటన జరిగింది. చిత్తూరు నుంచి వచ్చిన వేలి ముద్రల నిపుణులు సోమవారం ఆధారాలు సేకరించారు.

మృతదేహాలను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పద్మజ అభ్యంతరం చెప్పినప్పటికీ తండ్రికి సర్దిచెప్పి ఆదివారం అర్థరాత్రి తర్వాత జిల్లా ఆసుప్రతికి తరలించారు. ఇరుకుటుంబాలకు చెందిన బంధువులు రావడంతో వారి రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

తవణంపల్లె మండలం కొండరాజుకాలువ నుంచి వచ్చిన బంధువులే ఏర్పాట్లంతా చేశారు. మృతదేహాలను నేరుగా పెద్దతోపులోకి తీసుకెళ్లారు. పురుషోత్తంనాయుడు అప్పటికీ అంతగా తేరుకోకపోవడంతో కారులో తీసుకొచ్చి సాయంత్రం నాలుగున్నరకు తలకొరివి పెట్టించారు. కుమార్తెల అంత్యక్రియలకు తల్లి పద్మజ హాజరు కాలేదు. తల్లిదండ్రులపై హత్యకేసు నమోదు చేశామని రూరల్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.

మృతుల తల్లిదండ్రుల మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, ఇంట్లోనే ఉంచి చికిత్స అందించిన తర్వాత అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పురుషోత్తంనాయుడు తమ్ముడు మదనపల్లె గ్రామీణ మండలంలో టీచర్ కాగా, అన్న వ్యవసాయం చేస్తున్నాడు. తన కుమార్తెలను కూడా ఉన్నత చదువులు చదివించాడు. పద్మజ అన్న మురళి ఐఓసీలో, మరొకరు ఎస్ బీఐలో ఉద్యోగం చేస్తున్నారు. పురుషోత్తంనాయుడు మానవతా సంస్థలో, ఈషా ఫౌండేషన్ లో సభ్యుడిగా ఉంటున్నారు. తన జీతంలో పదిశాతం ఈషా ఫౌండేషన్ కు విరాళంగా ప్రకటించాడని కుటుంబ సభ్యులు, తోటి లెక్చరర్స్ చెబుతున్నారు.

అలేఖ్య తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ మతం రూపు మాసిపోతోందని.. శివుడు త్వరలో వస్తున్నాడని, చావు పుట్టుకలు తమ చేతుల్లోనే ఉన్నాయని సందేశాలు పెట్టింది. ఆ అకౌంట్ లో ఇటువంటి ఆధ్యాత్మిక సందేశాలే ఉన్నాయి. ఇవి సోమవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న పురుషోత్తంనాయుడు ఈ నెల 18వరకు కాలేజీకి వచ్చాడని.. 19వ తేదీ నుంచి సెలవులో ఉన్నాడని డాక్టర్ ప్రిన్సిపల్ ఆర్. వేణుగోపాల్ తెలిపారు. కాలేజీలో అందరితో బాగా ఉండేవారని, ఏ రోజూ మానసిక సమస్యలున్నట్లు ప్రవర్తించలేదని అన్నారు. మరోవైపు ఈ ఘటన గురించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. రెండు రోజుల క్రితం కుమార్తెలకు అనారోగ్యంగా ఉందని.. మానసిక పరిస్థితి సక్రమంగా లేదని, ఎవరినైనా మాత్రికుడ్ని పిలిపించాలని పురుషోత్తం నాయుడు తనతో చెప్పారని బి. కొత్తకోటలో ఉంటున్న రిటైర్డ్ లెక్చరర్ గౌరీ శంకర్ అన్నారు.

పట్టణానికి చెందిన మంత్రాలు వేసే ఓ వ్యక్తిని వారి ఇంటికి తీసుకెళ్లి ఇద్దరు పిల్లలకు తాయెత్తులు వేయించాం. అవి కట్టే సమయంలో ఇంట్లో దెయ్యం ఆత్మలు తిరుగుతున్నాయి అంకుల్.. మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్లండని సాయిదివ్య కోరడంతో ఏం కాదని ఆమెకు సర్ధి చెప్పా.. ఇంతలో ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆయన వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios