టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి అరెస్ట్ పై ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయ్యింది. ఆయనను గురువారం తెల్లవారుజామున అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టుపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయ్యింది. అయ్యన్న తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. తనను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని అయ్యన్న ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీని మీద మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా, మరోవైపు డీజీపీ కార్యాలయం వద్ద భద్రత పెంచారు. అయ్యన్నపాత్రుడి అరెస్ట్ నేపథ్యంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీసుకు వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వస్తారనే అనుమానంతో డీజీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ఇదిలా ఉండగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సీపట్నంలో గురువారం వేకువ జామున భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఆ తరువాత నోటీసులు అందజేసి అరెస్ట్ చేశారు .ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉంది. సీఐడీ పోలీసులు అయ్యన్నపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు.
కర్నూలు జిల్లాలో చిరుత పులి అనుమానాస్పద మృతి..
ఇదిలా ఉండగా, జూన్ 19న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని ఏపీ పోలీసులను చుట్టుముట్టారు. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటిగోడను ఆ రోజు తెల్లవారుజామున మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. గోడను పంట కాల్వను అక్రమించి నిర్మించారని మునిసిపల్ సిబ్బంది అభియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయ్యన్నపాత్రుడు ఇంటి వెనకాల ఉన్న గోడను మున్సిపాలిటీ సిబ్బంది కూల్చివేశారు. అయితే, ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోట చేసుకోకుండా.. అయ్యన్న ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
ఏ మీడియాను కూడా అయ్యన్న ఇంటి పరిసరాల్లోకి అనుమతించలేదు. అయ్యన్నపాత్రుడు ఇంటివైపు వెళ్లే మార్గాలన్నింటినీ పోలీసులు మూసివేశారు. అంతేకాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడి ఇంటి దగ్గరకు చేరుకోకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో నర్సీపట్నంలో హై టెన్షన్ నెలకొంది. ఇలా చేయడం మీద, పోలీసుల చర్యపై అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జూన్ నెల 2వ తేదీతో ఉన్న నోటీసును గోడ కూల్చేముందు ఇచ్చారని.. ఆ వెంటనే గోడను కూల్చివేశారని వారు చెబుతున్నారు. మరోవైపు అయ్యన్నపాత్రుడు ముఖ్య అనుచరుడు వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, గత కొద్ది రోజులుగా అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులపై చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై కేసులు కూడా నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడుపై మొత్తంగా 12కు పైగా కేసులు ఉన్నాయి. వీటితో పాటు అయ్యన్నపాత్రుడుపై నిర్బయ కేసు కూడా ఉంది. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. ఇటీవల చోడవరంలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో మంత్రి రోజా, పోలీసులతో పాటుగా సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగింది.
