యువతిపై సుత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది.. తల్లి, సోదరికీ గాయాలు... ఆపై గొంతు కోసుకుని..
తూర్పు గోదావరి జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తాను ప్రేమను నిరాకరించిందని అమ్మాయితో పాటు ఆమె తల్లి, సోదరి మీద సుత్తితో దాడి చేశాడు.
తూర్పు గోదావరి జిల్లా : ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రేమోన్మాది హల్ చల్ సృష్టించాడు. ఓ యువతి మీద సుత్తితో దాడి చేశాడు. ఆ తరువాత తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రేమిస్తున్నానని చెబితే తన ప్రేమను నిరాకరించందని యువతి మీద దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లిని, యువతి సోదరిని కూడా సుత్తితో దాడి చేశాడు.
తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలం, కడియపులంకలో శనివారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడు రోజుల క్రితం తూ.గో. జిల్లా పొట్టిలంక గ్రామానికి చెందిన నిందితుడు దాసరి వెంకటేష్.. యువతి తండ్రికి ఫోన్ చేశాడు. నీ కూతుర్ని ప్రేమించాను.. నాతో పెళ్లి చేయకపోతే మీ అమ్మాయిని చంపేస్తాను’ అని బెదిరించాడు.
విజయవాడ దుర్గగుడిలో భారీగా అంతర్గత బదిలీలు.. కొందరు ఉద్యోగుల అభ్యంతరం..
దీన్ని తల్లిదండ్రులు సీరియస్ గా తీసుకోలేదనుకున్నాడో ఏమో.,, శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత వెంకటేష్ యువతి ఇంటి గోడదూకి ఇంట్లోకి ప్రవేశించాడు. యువతి పడుకున్న చోటికి వెళ్లి.. ఆమె తలపై సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో మేల్కొన్న తల్లి, సోదరి.. వెంకటేష్ ను అడ్డుకోబోయారు. దీంతో అతను వారిద్దరి మీద కూడా దాడి చేశాడు. ఈ దాడిలో వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ఆ తరువాత వెంకటేష్ తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ మేరకు యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు దాడికి వచ్చిన సమయంలో అతని వెంట మరో నలుగురు వ్యక్తులు కూడా వచ్చారని తేలింది.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని, ఆమె తల్లి, సోదరిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. నిందితుడికి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెప్పుకొచ్చారు.