గుంటూరులో దారుణం... ప్రియుడి కుటుంబంపై ప్రియురాలి కుటుంబం కత్తులతో దాడి, ఏడుగురికి గాయాలు
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువతితో ప్రేమ వ్యవహారం యువకుడినే కాదు అతడి కుటుంబసభ్యులను హాస్పిటల్ పాలు చేసింది.
గుంటూరు : యువతీ యువకుల ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల మధ్య శతృత్వాన్ని పెంచింది. ఇది అంతకంతకూ పెరిగి ఓ కుటుంబంపై మరో కుటుంబం కత్తులు, కర్రలతో దాడులకు దిగి ప్రాణాలు తీసే స్థాయికి చేరింది. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానిక పోలీసులు, బాధిత కుటుంబం, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాపట్ల మండలం కంకటపాలెం గ్రామానికి చెందిన ఆనంద్ అదే గ్రామానికి చెందిన దివ్య ఒకరినొకరు ఇష్టపడ్డారు. చాలాకాలంగా వీరిద్దరి ప్రేమాయణం సాఫీగా సాగగా ఇరు కుటుంబాలకు విషయం తెలియడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. తమ అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించాడంటూ ఆనంద్ పై, అతడికి సహకరిస్తున్నారని కుటుంబసభ్యులకు యువతి కుటుంబం కక్షగట్టింది.
ఈ క్రమంలోనే ఈ ప్రేమ వ్యవహారం కంకటపాలెంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఆవేశంతో రగిలిపోయిన దివ్య కుటుంబసభ్యులు ఆనంద్ ఇంటిపై దాడికి వెళ్లారు. కత్తులు, కర్రలతో యువకుడితో పాటు కుటుంబసభ్యులను విచక్షణారహితంగా దాడికి దిగారు. దీంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఈ కుటుంబం బాపట్ల హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.
read more ఒంటరి మహిళలను చూసి ట్రాప్ చేస్తాడు.. నగలన్నీ దోచుకెళ్తాడు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాపట్ల పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దాడికి పాల్పడిన యువతి కుటుంబసభ్యులను గుర్తించే పనిలోపడ్డారు. ఈ ఘటనతో కంకటపాలెంలో ఉద్రిక్తత నెలకొంది.
ఇదిలావుంటే కృష్ణా జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. అత్తపై కోపంతో రగిలిపోయిన ఓ కోడలు కిరాతకంగా వ్యవహరించింది. అత్తను హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా పోస్గుమార్టంలో హత్యగా తేలడంతో అడ్డంగా బుక్కయింది ఈ కసాయి కోడలు. ఇలా క్షణికావేశంలో అత్తను చంపి కోడలు జైలుపాలయ్యింది.
పెడన పరిధిలోని కృష్ణాపురానికి చెందిన పడమట వీరబాబుతో కొండాలమ్మ వివాహం జరిగి దాదాపు పన్నెండేళ్లు అయ్యింది. పెళ్లైన నాటి నుంచి అత్తాకోడళ్లు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. దీంతో అత్త రజనీ కుమారిపై కోడలు కొండాలమ్మ కక్ష పెట్టుకుంది. ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఆ సమయం కోసం ఎదురుచూసింది.
అయితే గత నెల 27వ తేదీన ఇంట్లో ఎవరూ లేని టైంలో ఓ కర్ర తీసుకుని అత్త రజనీకుమారి తలమీద విచక్షణా రహితంగా బలంగా కొట్టింది. ఆ తరువాత గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించింది. ఇంత చేసినా ఆమె చనిపోకపోవడంతో మెడకు చీరతో ఉరి బిగించింది. దీంతో అత్త నోరు, ముక్కుల్లో నుంచి రక్తం రావడంతో స్పృహ కోల్పోయింది. వరండాలో కాలుజారి పడి గాయపడిందని కోడలు తెలిపింది. ఇది నిజమని నమ్మిన కుటుంబసభ్యులు కొండాలమ్మను హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోస్గుమార్టం రిపోర్టులో ఆమెది హత్యగా తేలడంతో కోడలు నాటకం బయటపడి జైలుపాలయ్యింది.