తిరుమలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా... దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయించిన ఎంపీ విజయసాయి (వీడియో)
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకుని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు టిటిడి ఛైర్మన్, వైసిపి ఎంపీలు, ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.
తిరుమల: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకున్న స్పీకర్ ను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
స్పీకర్ ఓం బిర్లా కుటుంబం ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి ఆ తరువాత మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఓం బిర్లా కుటుంబానికి వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈఓ కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్, కాఫీ టేబుల్ బుక్ ను ఓంబిర్లాకు అందించారు.
వీడియో
ఈ కార్యక్రమంలో ఎంపిలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, గురుమూర్తి, భరత్, కలెక్టర్ హరినారాయణన్, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆలయ డిప్యూటీ ఈఓ రమేష్ బాబు, రిసెప్షన్ డిప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.