చంద్రబాబునాయుడు బెదిరించడం వల్లే ఆనాడు మోహన్ బాబు తమకు దూరమయ్యాడని వైసీపీ నేత, ఎన్టీఆర్  సతీమణి లక్ష్మీపార్వతి ప్రకటించారు


హైదరాబాద్:చంద్రబాబునాయుడు బెదిరించడం వల్లే ఆనాడు మోహన్ బాబు తమకు దూరమయ్యాడని వైసీపీ నేత, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ప్రకటించారు. మోహన్ బాబు వైసీపీలో చేరినందున ఆయనపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మంగళవారం నాడు ఆమె హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. హెరిటేజ్ సంస్థలో వాటాల విషయంలో భయపడే మోహన్ బాబు చంద్రబాబు వైపుకు వెళ్లాడని ఆమె అభిప్రాయపడ్డారు. నాకు కానీ, ఎన్టీఆర్‌కు కానీ మోహన్ బాబు ఏనాడూ కూడ అన్యాయం చేయలేదని ఆమె చెప్పారు. తనకు, తన భర్త ఎన్టీఆర్‌కు రాష్ట్రానికి ద్రోహం చేసింది చంద్రబాబునాయుడేనని ఆమె ఆరోపించారు. 

వైస్రాయ్ హోటల్‌కు వెళ్లిన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు 15 రోజులకే తమ వద్దకు వచ్చి తప్పైందని ఒప్పుకొన్నాడని ఆమె గుర్తు చేశారు. పశ్చాత్తాపం వ్యక్తం చేసిన వారిని విమర్శించడం సరైందికాదన్నారు.

ఎన్టీఆర్ ప్రధానమంత్రి కాకుండా భారతరత్న రాకుండా అడ్డుకొంది చంద్రబాబునాయుడేనని ఆమె ఆరోపించారు.ఎన్టీఆర్ లక్ష్మీస్ సినిమాను విడుదల కాకుండా చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.