వామనరావు దంపతుల హత్య.. రాజాంలో విషాదం
ఈ ఘటనలో హత్యకు గురైన నాగమణి స్వస్థలం రాజాం పట్టణం. ఈమె భర్త వామన్ రావును దుండగులు పొట్టనపెట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో ఇటీవల న్యాయవాద దంపతులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో హత్యకు గురైన నాగమణి స్వస్థలం రాజాం పట్టణం. ఈమె భర్త వామన్ రావును దుండగులు పొట్టనపెట్టుకున్నారు.
నాగమణి తండ్రి రమణమూర్తి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. కాగా ఆమె తల్లి గృహిణి. సోదరుడు శ్రీనివాస్ ఎచ్చెర్లలో అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
కాగా.. నాగమణి.. తన భర్త వామన్ రావుతో కలిసి తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఈమె ఇంటర్ రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివారు. హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఎల్ఎల్బీ పట్టా కూడా అక్కడే పొందారు. రంగారెడ్డి జిల్లాలో తండ్రి రమణమూర్తి ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సమయంలోనే వామన్ రావు తో ప్రేమ వివాహం జరిగింది. బంధువుల శుభకార్యాలు, ఇతర వేడుకలు, పండగకు భర్తతో కలిసి రాజాంలోని కన్నవారింటికి వచ్చేవారు. కాగా.. ఆమె మరణ వార్త స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.