లాన్స్ నాయక్ సాయితేజ మృతదేహం స్వగ్రామం ఎగువ రేగడకి చేరుకొంది. సాయితేజ మృతదేహన్ని 30 కి.మీ దూరం ఊరేగించారు. ఈ నెల 8వ తేదీన తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో సాయితేజ మరణించాడు. 

చిత్తూరు: ఈ నెల 8వ తేదీన తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో మరణించిన లాన్స్‌నాయక్ సాయితేజ మృతదేహం ఆదివారం నాడు ఉదయం స్వగ్రామం ఎగువరేగడకు చేరుకొంది.  మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా డెడ్‌బాడీని గుర్తించారు. శనివారం నాడు సాయితేజ మృతదేహన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రత్యేక విమానంలో ఈ డెడ్‌బాడీని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అమర జవాన్ లాన్స్ నాయక్ సాయితేజకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. Sulur helicopter crash లో మృతి చెందిన సాయితేజ బౌతిక కాయాన్ని 30 కి.మీ దూరం ఊరేగింపుగా తీసుకెళ్లారు.

చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామమైన చీకలబైలు చెక్‌పోస్టు, వలసపల్లి మీదుగా ఎగువరేగడకి రోడ్డు మార్గంలో 30 కి.మీ దూరం  ర్యాలీగా Saiteja డెడ్‌బాడీని తీసుకొచ్చారు. సాయితేజ బంధువులు, స్నేహితులు, స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.రోడ్డుకు ఇరువైపులా జాతీయ పతాకాలను చేతబూని స్థానికులు సాయితేజ మృతదేహన్ని తిలకించేందుకు స్థానికులు మానవహరంగా ఏర్పడ్డారు. చిన్నప్పటి నుండి సైన్యంలో చేరేందుకు సాయితేజ కష్టపడ్డాడని ఆయన గురించి స్థానికులు గుర్తు చేసుకొంటున్నారు.  

alos read:Sulur chopper crash: సాయితేజ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన వైఎస్ జగన్

ఎగువరేగడలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన మోహన్, భువనేశ్వరి దంపతులకు సాయితేజ, మహేష్‌బాబు సంతానం. సాయితేజ స్థానికంగానే చదువుకున్నారు. 10వ తరగతి పూర్తి కాగానే  సైన్యంలో చేరారు. డిగ్రీ పూర్తి చేసి గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌కు హజరై 2012లో సైనికుడిగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పారా కమెండో పరీక్ష రాసి 11వ పారా లాన్స్‌ నాయక్‌ హోదా దక్కించుకున్నాడు.  ఏడు నెలల క్రితమే జనరల్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా (PSO to the CDS) నియమితులయ్యారు. సాయితేజ సోదరుడు మహేష్‌బాబు కూడా సైన్యంలోనే ఉన్నారు.

సాయితేజకు భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ (5), దర్శిని (2) ఉన్నారు. అయితే కొద్ది నెలల క్రితమే సాయితేజ.. తన కొడుకు మోక్షజ్ఞ ప్రాథమిక విద్య కోసం గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలోని మదనపల్లె పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీకి తన భార్యాపిల్లలను మార్చారు. చివరి సారిగా వినాయకచవితికి సాయితేజ ఇంటికి వచ్చారు. జనవరిలో సంక్రాంతి పండగకు వస్తానని కుటుంబ సభ్యులతో తెలిపారు. సాయితేజ రోజు భార్య, పిల్లలతో ఫోన్‌లో మాట్లాడేవారు. బుధవారం కూడా సాయితేజ భార్యకు వీడియో కాల్ చేశారు. సాయి తేజ మృతిచెందారనే వార్త తెలియడంతో అతని స్వగ్రామం రేగడపల్లె‌లో విషాదఛాయలు నెలకొన్నాయి.  సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాయితేజ కుటుంబానికి రూ. 50 లక్షల చెక్ ను శనివారం నాడు అందించారు. 
ఎగువ రేగడ గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సాయితేజ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సాయితేజ చిత్ర పటానికి ఆయన కొడుకు ముద్దు పెట్టుకోవడం చూసిన స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు.