ఆ విషయాన్ని కేంద్రానికి తెలుపండి.. ఏపీ సీఎం జగన్కు కేవీపీ లేఖ
పోలవరం బాధ్యతలను కేంద్రం విస్మరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. పోలవరంపై ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతలను కేంద్రం వదిలేసిందని విమర్శించారు.
పోలవరం బాధ్యతలను కేంద్రం విస్మరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కేవీపీ లేఖ రాశారు. పోలవరంపై ఇతర రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతలను కేంద్రం వదిలేసిందని జగన్కు రాసిన లేఖలో విమర్శించారు. కేంద్రం తీరు వల్లే ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సుప్రీం కోర్టు చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. పోలవరంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడానికి కేంద్రమే కారణమని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాలను ఒప్పించడం, పర్యావరణ నిబంధనల ప్రకారం కరకట్టల నిర్మాణానికి.. ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ప్రజాభిప్రాయ సేకరణ చేసే బాధ్యత కూడా కేంద్రానిదేనని కేవీపీ అన్నారు. ఇదే విషయం కేంద్రానికి తెలుపాలని లేఖలో కేవీపీ పేర్కొన్నారు. ఇక, వైఎస్ జగన్ తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మగా కేవీపీ రామచంద్రరావుకు పేరున్న సంగతి తెలిసిందే.