ఏపీలో చంద్రబాబుకు మరో షాక్: టీడీపీకి కుతూహలమ్మ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి సీనియర్ నేత, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ రాజీనామా చేశారు.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన కుతూహలమ్మ టీడీపీకి రాజీనామా చేశారు. వృత్తిరీత్యా Kuthuhalamma వైద్యురాలు. కాంగ్రెసు తరఫున చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆమె పనిచేశారు.
కుతూహలమ్మ 1985లో వేపంజేరి (ప్రస్తుతం జీడీ నెల్లూరు) నియోజకవర్గం నుంచి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ స్థానం నుంచే ఆమె 1989, 1999, 2004 ఎన్నకల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన వైద్య ఆరోగ్య, స్త్రీ సంక్షేమ మంత్రిగా పనిచేశారు.
కుతూహలమ్మ 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. 1994లో కాంగ్రెసు పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో డీజీ నెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
Also Read: అసంతృప్తి తీవ్రత: చంద్రబాబు ఫొటోను తీసేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని
రాష్ట్ర విభజన తర్వాత కుతూహలమ్మ TDPలో చేరారు జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు. ఆమె కుమారుడు, టీడీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జీ హరికృష్ణ కూడా పార్టీకి, నియోజకవర్గం ఇంచార్జీ పదవికి రాజీనామా చేశారు.
టీడీపీ తమను ఎంతో గౌరవించిందని, అనారోగ్యం కారణంగా ప్రజల్లో తిరగలేకపోతున్నామని, దాంతో పార్టీకి న్యాయం చేయలేకపోతున్నామని, దానివల్లనే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని, తమకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని కుతూహలమ్మతో పాటు హరికృష్ణ కూడా చెప్పారు.
శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత ఏపీలో Chnadrababuకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వల్లభనేని వంశీకృష్ణ, కరణం బలరాం వంటి కొంత మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీకి దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరయ్యారు. సాంకేతికంగా మాత్రమే వారు వైసీపీలో చేరలేదు.
మరోవైపు సీనియర్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరింతగా అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో తన పార్టీ వద్ద ఉన్న చంద్రబాబు ఫ్లెక్సీలను, ఇతర నాయకుల ఫ్లెక్సీలను తొలగించారు. ఆయన పూర్తిగా పార్టీకి దూరమైనట్లే. వచ్చే ఎన్నికల వరకు ఎంపీగా మాత్రం కొనసాగుతానని ఆయన చెప్పారు.
బొండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్నలతో విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో తలెత్తిన విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు ఏ విధమైన ప్రయత్నాలు కూడా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.