Heavy Rains: కర్నూలులో విషాదం.. కార్తీక దీపాలు వెలిగించడానికి వెళ్లి దంపతుల మృతి
ఆంధ్రప్రదేశ్లో వర్ష బీభత్సం (Heavy Rains in Andhra Pradesh) కొనసాగుతుంది. భారీ వర్షాలు కర్నూలు (Kurnool) జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. కార్తీక దీపాలు వెలిగించేందుకు వెళ్లిన దంపతులు మృతిచెందారు.
ఆంధ్రప్రదేశ్లో వర్ష బీభత్సం (Heavy Rains in Andhra Pradesh) కొనసాగుతుంది. భారీ వర్షాలు కర్నూలు (Kurnool) జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. కార్తీక దీపాలు వెలిగించేందుకు వెళ్లిన దంపతులు మృతిచెందారు. వివరాలు.. కర్నూలు అబ్బాస్నగర్కు చెందిన దంపతులు రాఘవేంద్ర, ఇందిరలు.. వినాయక్ ఘాట్ వద్ద కేసీ కాల్వలో తెల్లవారుజామున కార్తీక దీపాలు (Kartika Deepalu) వెలగించేందుకు వెళ్లారు. వారితో పాటు 8 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే దీపాలు వెలిగించడానికి వెళ్లిన ఇందిర, రాఘవేంద్రలు కేసీ కాల్వ వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. అయితే తన కళ్లముందే తల్లిదండ్రులు నీటిలో కొట్టుకుపోతుంటే ఏం చేయాలో తెలియక బాలుడు అక్కడే నిలబడిపోయాడు.
అయితే అటుగా వచ్చిన కొందరు బాలుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పడిదంపాడు వద్ద రాఘవేంద్ర, ఇందిర దంపతుల మృతదేహాలను గుర్తించారు. అనంతరం మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Also read: Kadapa Rains: సీఎం సొంత జిల్లాలో వర్షబీభత్సం... వరదల్లో కొట్టుకుపోయిన 30మంది, మూడు మృతదేహాలు లభ్యం
ఇక, కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అకాల వర్షానికి పంట పొలాల్లో భారీగా నీరు చేరడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో ఈ వర్షతీవ్రత ఎక్కువగా వుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిపరిస్థితులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకునేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.
chittoor, nellore, kadapa districts లో వరద సహాయక పనుల పర్యవేక్షణను ప్రత్యేక అధికారులు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి ys jaganmohan reddy ఆదేశాల మేరకు గత రాత్రే అధికారులు ఆయా జిల్లాలకు చేరుకున్నారు. భారీ వర్షాల వల్ల సంభవిస్తున్న వరదల నేపథ్యంలో సహాయ చర్యలను ఆ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్ కు నివేదిస్తారు.
ఇదిలావుంటే రాయలసీమలో వర్షతీవ్రత ఎక్కువగా వుండనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అనంతపురం జిల్లా ప్రజలు అత్యవసరమయితే తప్ప బయటికి రావొద్దని ఎస్పీ ఫక్కీరప్ప హెచ్చరించారు. ఈరోజు, రేపు (శుక్ర, శనివారాలు) తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో ఎడితెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశముందని... ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు.