సీఎం బాధ్యత వదిలేసి మరీ మాయామశ్చీంద్ర పాత్ర: జగన్ పై జవహర్ ఆగ్రహం
జగన్ పాలనలో మేధావి వర్గమైన ఉద్యోగులంతా తమ గొంతు తామే నొక్కుకొని మౌనానికే పరిమితమయ్యారని మాజీ మంత్రి జవహర్ ఆందోళన వ్యక్తం చేశారు.
గుంటూరు: జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు వదిలేసి మాయామశ్చీంద్రపాత్ర పోషిస్తున్నాడని మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ ఆరోపించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపడంపైనే ఆయనదృష్టంతా ఉందని ఎద్దేవా చేశారు. జాబ్ కేలండర్ పేరుతో డూప్ కేలండర్ విడుదలచేసిన ముఖ్యమంత్రి వేలాది ఉద్యోగులను, లక్షలాదిమంది నిరుద్యోగులను మోసగించాడని మండిపడ్డారు.
కొత్తగా ఉద్యోగాలేవో సృష్టిస్తున్నట్లు ముఖ్యమంత్రి రెండేళ్లు యువతకు భ్రమ కల్పించాడని జవహర్ అన్నారు. జగన్ పాలనలో మేధావి వర్గమైన ఉద్యోగులంతా తమ గొంతు తామే నొక్కుకొని మౌనానికే పరిమితమయ్యారని... వారి మౌనం వారి కుటుంబాలతో పాటు సమాజానికి, రాష్ట్రానికి కూడా మంచిదికాదని జవహర్ సూచించారు. ఉద్యోగులతో పాటు, ఉపాధ్యాయులను జగన్ మోసగిస్తున్న తీరుపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయో తెలియడంలేదన్నారు జవహర్ .
జీపీఎస్ రద్దుని ఈ ముఖ్యమంత్రి అటకెక్కించాడని, డీఏలు ఎప్పుడిస్తారో తెలియడంలేదని, పీఆర్సీ అమలు అసలే లేదని... వీటన్నింటికీ తోడు నాడు-నేడు పేరుతో ఉపాధ్యాయులను ప్రభుత్వం బలి తీసుకుంటున్న తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు ముఖ్యమంత్రిని నిలదీయడంలేదని జవహర్ ప్రశ్నించారు. ఆయా సంఘాల నాయకులు భయంతో నోరు విప్పడంలేదా లేక ముఖ్యమంత్రి ఇంకా ఏదోచేస్తాడనే భ్రమల్లో వారున్నారా? అని మాజీమంత్రి ప్రశ్నించారు.
read more జగన్ ఇంటికి కూతవేటు దూరంలోనే యువతిపై అత్యాచారం... ఇదీ రాష్ట్రంలో శాంతిభద్రతలు: చంద్రబాబు సీరియస్
జాబ్ కేలండర్ పేరుతో ఉద్యోగులకు ఏం కలిసొచ్చిందో ఉద్యోగ సంఘాలే చెప్పాలన్నారు. నిరుద్యోగులకు మద్ధతివ్వాల్సిన ఉద్యోగ సంఘాలు నేడు ఆ పనిచేయకుండా ఎందుకు మౌనంగా ఉన్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి జాబ్ కేలండర్ విడుదల చేయడంలోని ఉద్దేశం కరోనా నుంచి ప్రజలను దారిమళ్లించడానికేనని జవహర్ తేల్చిచెప్పారు.
రాష్ట్రంవైపు పారిశ్రామికవేత్తలెవరూ కన్నెత్తి చూడటంలేదని, ఉన్నపరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను కూడా సారెపెట్టి మరీ ప్రభుత్వం సాగనంపుతోందన్నారు. ముఖ్యమంత్రి ధాటికి రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలెవరూ వచ్చే పరిస్థితిలేకుండా పోయిందన్నారు. దాంతో రాష్ట్రంలో నిరుద్యోగంపెరిగి, యువత తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో ఉందన్నారు. విద్యావవ్యవస్థను నాశనం చేయడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడన్నారు. జాతీయ విద్యావిధానం పేరుతో ముఖ్యమంత్రి నిర్ణయాలతో 34వేల పాఠశాలలకు ఎఫెక్ట్ కానుందన్నారు.
ఉపాధ్యాయుల పరిస్థితి ఘోరంగా ఉన్నాకూడా మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంకా పరీక్షలు నిర్వహిస్తామనడం దేనికి సంకేతమన్నారు. ప్రభుత్వతీరు, ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మౌనంగా ఉండటం ఏమాత్రం మంచిదికాదని, ఎవరికి భయపడి సంఘాలపెద్దలు నోరెత్తడంలేదో వారే సమాధానం చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాల నేతలు బానిసత్వాన్ని వీడి, మౌనా న్ని త్యజించాల్సిన సమయం వచ్చిందన్నారు. నిరుద్యోగు లతోపాటు, ఉపాధ్యాయ ఉద్యోగసంఘాలుకూడా పోరాటబాట పడితేనే ముఖ్యమంత్రినేలకు దిగుతాడని జవహర్ తేల్చిచెప్పారు.