అన్నలా వుంటానని... మహిళలతో దున్నలా వ్యవహరిస్తావా..: జగన్ పై కొల్లు రవీంద్ర సీరియస్
అధికారం కోసం నాడు అసాధ్యమైన హామీలిచ్చి... అధికారం రాగానే వంచనకు తెరలేపారంటూ జగన్ పై మాజీ మంత్రి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు: చేయూత పేరుతో జగన్ రెడ్డి బీసీ మహిళలను నిలువునా ముంచారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అధికారం కోసం నాడు అసాధ్యమైన హామీలిచ్చి... అధికారం రాగానే వంచనకు తెరలేపారని రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
''45 ఏళ్లు దాటి వెనుకబడిన వర్గానికి చెందిన ప్రతి అక్కా, చెల్లెమ్మకు అండగా ఉంటానన్న జగన్ రెడ్డి.. నమ్మక ద్రోహనికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. జగన్ రెడ్డి హామీ మేరకు ఒక్కో మహిళకు నెలకు రూ.3వేల చొప్పున పెన్షన్ అంటే.. ఏడాదికి రూ.36వేలు అందాలి. కానీ పాదయాత్రలో ఇచ్చిన హామీపై మడమ తిప్పి రూ.18వేలు ఎగ్గొట్టారు. ఇదేనా వెనుకబడిన వర్గాలపై ఉన్న చిత్తశుద్ధి.?'' అని నిలదీశారు.
''అన్నగా అండగా ఉంటానని చెప్పి ఓట్లు వేయించుకుని.. పదవి రాగానే దున్నలా మహిళల్ని కొమ్ములతో కుమ్ముతున్నారు. చేయూత అంటూ హడావుడి చేస్తూ మహిళల సంక్షేమంలోనూ చేతివాటం చూపడమా? వ్యాపారాలు చేసుకోవడానికి అండగా ఉంటానన్న జగన్ రెడ్డి.. అమూల్ కు మాత్రమే పాలు పోయాలి, అల్లానా కంపెనీకి మాత్రమే మాంసం దక్కాలని ఒప్పందం చేసుకోవడం కమిషన్ల కక్కుర్తి కోసం కాదా.? మీ కమిషన్ల కోసం, మీ జేబులు నింపుకోవడం కోసం మహిళలను వంచించడానికి సిగ్గులేదా.?'' అని మండిపడ్డారు.
read more అన్న కాకుంటే జగనన్న, రాజన్న క్యాంటీన్లు...: సీఎంకు రఘురామ మరో లేఖ
''తెలుగుదేశం ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.2లక్షల వరకు రుణం ఇచ్చి అందులో రూ.లక్ష సబ్సిడీ అందించింది. వ్యపారానికి అండగా నిలిచింది. స్టార్టప్స్ పెట్టేవారికి భూములు, రాయితీ రుణాలు, పరికరాలు అందించింది. మహిళల్ని ఆర్ధికంగా స్వతంత్రుల్ని చేయాలని భావించి డ్వాక్రా గ్రూపుల్ని తీసుకొచ్చింది. కానీ.. జగన్ రెడ్డి రూ.18వేలు ఇచ్చి వ్యాపారాలు చేసుకోండని చెప్పడం సిగ్గుచేటు.. మీరిచ్చే సొమ్ముతో ఏ వ్యాపారం చేయవచ్చో చెప్పగలరా జగన్ రెడ్డీ.?'' అని నిలదీశారు.
''ఇకనైనా బడుగు బలహీన వర్గాలను సంక్షేమం పేరుతో వంచించడం మానుకోండి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మహిళా లోకాన్ని వంచించినందుకు క్షమాపణలు చెప్పండి. లేదంటే.. రేపు ఎన్నికల్లో ప్రతి మహిళా ఓ రుద్రకాళిలా మారి నిన్ను, నీ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయడం తధ్యమని గుర్తుంచుకోండి'' అని రవీంద్ర ఎద్దేవా చేశారు.