ఎన్నికల బరిలోకి కోడికత్తి శ్రీను.. అమలాపురం నుంచి పోటీ?
ఎన్నికల బరిలో కోడికత్తి శ్రీను దిగుతున్నారు. ఆయన అమలాపురం స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు తెలిసింది.
వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ పై కోడికత్తి దాడి జరిగిన కేసులో ఐదేళ్లపాటు జైలులో గడిపి బయటికి వచ్చిన జానిపల్లి శ్రీనివాస్ రావు అలియాస్ కోడికత్తి శ్రీను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసి ఆయన ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎక్కువగా బయట బయట కనిపిస్తున్నారు. దళితుడైన శ్రీనివాస్ను పలు సంస్థలు తమ సమావేశాలకు ఆహ్వానిస్తుండటంతో ఆయన తరచూ వార్తల్లో నానుతున్నారు.
సోమవారం రాత్రి ఆయన జైభీమ్ భారత్ పార్టీలో చేరారు. ఆ పార్టీ చీఫ్ జాడ శ్రవణ్ కుమార్ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల ముంగిట్లో ఆయన ఓ రాజకీయ పార్టీలోకి చేరడంతో కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: ‘దేవుడి సమక్షంలో దళితుడికి అన్యాయం’.. యాదాద్రి ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి
దళితులు, పేదల పక్షాన పని చేయాలనే బలమైన కాంక్షతో తాను రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్నట్టు కోడికత్తి శ్రీను తెలిపారు. తాను స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుగా నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కానీ, తనను జేబీపీ ఆహ్వానించడంతో వచ్చి ఈ పార్టీలో చేరానని పేర్కొన్నారు. తాను కుల, మత ఆధారంగా రాజకీయాలు చేయాలని భావించడం లేదని, కేవలం పేదల కోసం పని చేయాలని మాత్రం నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. అన్ని కుదిరితే ఆయన అమలాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది.