ఇవాళ రాత్రి ధ్వజావరోహణంతో తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం ఉదయం 7.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఆల‌యం వ‌ద్ద గ‌ల వాహ‌న మండ‌పంలో చ‌క్ర‌స్నానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. ఇవాళ రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ముందుగా ఉదయం 7.30 గంటలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాములను, చక్రత్తాళ్వార్‌‌ను ఆలయం వ‌ద్ద గ‌ల వాహ‌న‌ మండపంలోనికి వేంచేపు చేశారు. అనంత‌రం సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబరి నీళ్ళతో అభిషేకం చేశారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ గంగాళంలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

 ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్‌ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు మునిరత్నం‌, జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు ధ్వజావరోహణంతో కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.